భారతీయ వెండితెరపై బాహుబలిగా ఎదిగిన ప్రభాస్ కు ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రాధేశ్యామ్’ చిత్రం ఫలితం షాక్ ఇచ్చిందని చెప్పాలి. ఆయన అభిమానులనూ తీవ్రంగా నిరాశపరచిందీ మూవీ. అంతకుముందు వచ్చిన సాహో చిత్రం కూడా ఉత్తరాదిన విజయవంతమైనా తెలుగు ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ నుంచి ఆయన స్థాయికి తగిన ఓ భారీ సక్సెస్ ను ఆశిస్తున్నారు అభిమానులు. ప్రభాస్ కథానాయకుడిగా ప్రస్తుతం రెండు భారీ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్నాయి. వీటిలో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ‘ఆదిపురుష్’ ఒకటి కాగా .. కేజీఎఫ్ సీక్వెల్ చిత్రాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రశాంత్నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘సలార్’ రెండోది.
నిజానికి రామాయణం ఆధారంగా అత్యంత భారీ వ్యయంతో నిర్మాణమవుతున్న‘ఆదిపురుష్’ చిత్రం షూటింగ్ పార్ట్ చాలావరకు ఇప్పటికే పూర్తయినట్టు వార్తలు వస్తున్నా దీనికి సంబంధించి చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ ఏడాది చివరిలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకుని ఈ చిత్రం ప్రమోషన్లు ఎప్పుడు మొదలుపెడతారో చూడాల్సి ఉంది.
కాగా కేజీఎఫ్కు మించి బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించడం ఖాయమని అందరూ భావిస్తున్న ‘సలార్’ చిత్రం 2023 ఏప్రిల్లో విడుదల చేస్తామని ఈ చిత్ర యూనిట్ మొదట్లో ప్రకటించినా, అది సాధ్యం కాకపోవచ్చని, వచ్చే ఏడాది దసరా కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తెచ్చే ఉద్దేశంలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం అప్పటిదాకా ప్రభాస్ అభిమానులు ఎదురు చూడక తప్పదన్నమాట.