దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ అనంతబాబును వైసీపీ అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు పార్టీ తాజాగా ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ హత్య సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో అనంతబాబుకు మేజిస్ట్రేట్ 14 రోజులపాటు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన అనంతబాబు వద్ద గతంలో సుబ్రహ్మణ్యం డ్రైవర్గా పని చేసేవాడు. అతడు ఈ నెల 19న హత్యకు గురయ్యాడు. అనంతరం సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి కాకినాడలో ఆయన ఇంటికి సమీపంలో వదిలి వెళ్లారు. హత్య చేసి దానిని యాక్సిడెంట్గా చిత్రీకరించే కుట్ర చేశారంటూ ఎమ్మల్సీ అనంతబాబుపై ఆరోపణలు వచ్చాయి. అనంతబాబే హత్య చేసినట్టు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఈ ఘటనపై దళిత సంఘాలు పోరాటానికి దిగాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు… ప్రాథమిక విచారణలో అనంతబాబు హత్య చేసినట్లు గుర్తించారు. అనంతబాబు కూడా సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో అనంతబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించి మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టారు. కేసు విచారించిన మేజిస్ట్రేట్ అనంతబాబుకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
దళిత ఆందోళనతోనే..
ఈ నేపథ్యంలోనే హత్యా నేరానికి పాల్పడి పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించడంతోపాటు.. దళితుల్లో ఆగ్రహానికి కారణమైన అనంతబాబుపై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది. సుబ్రమణ్యం హత్య పై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు, దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేసాయి. పోలీసులు తీరుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ, .రోడ్డెక్కారు. దీంతో తప్పని పరిస్టులలో అనంత బాబును అరెస్టు చేసారు. వైసీపీ పై దళితుల తీవ్ర వ్యతిరేఖత దృష్ట్యా అనంత బాబుపై వైసీపీ సస్పెన్స్ వేటు వేసింది.