ఇటీవలికాలంలో దక్షిణాది చిత్రాలు సంచలన విజయాలు సాధిస్తూ భారతీయ వెండితెరపై బాలీవుడ్ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేశంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఘనతను కూడా సౌత్ హీరోలే దక్కించుకుంటున్నట్టు పరిశ్రమ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అందులోనూ టాలీవుడ్ నుంచే ఇద్దరు హీరోలు ప్రస్తుతానికి ఈ విషయంలో పోటీ పడుతున్నారని టాక్. నిజానికి జక్కన్న చెక్కిన బాహుబలి చిత్రం సాధించిన అపూర్వ విజయంతో ప్రభాస్ ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా ఆవిర్భవించడమే కాదు.. అత్యధిక పారితోషికం తీసుకున్న ఘనతను కూడా దక్కించుకున్నాడు. ఆ సినిమాకు రూ. 50-100 కోట్ల మధ్యలో ప్రభాస్ తీసుకున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. కాగా ఆ తరువాత ప్రభాస్ హీరోగా భారీ అంచనాల మధ్య విడుదలైన సాహో, రాధేశ్యాం చిత్రాలు ఊహించనివిధంగా పరాజయం పాలయ్యాయి. దాంతో అతడి జోరు కాస్త తగ్గింది.
ఇదే సమయంలో పుష్ప చిత్రంతో అల్లు అర్జున్, ఆర్ఆర్ఆర్ చిత్రం ద్వారా తారక్, రాంచరణ్ కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరు నటించే తదుపరి చిత్రాలు కూడా పాన్ ఇండియా స్థాయిలోనే నిర్మాణం జరుపుకుంటున్నాయి. ఇక పుష్ప మూవీ సాధించిన సంచలన విజయంతో అల్లు అర్జున్ స్థాయి ఒక్కసారిగా మారిపోయింది. పుష్ప-2 చిత్రంపై అసాధారణ అంచనాలు ఏర్పడిన నేపథ్యంలో వాటికి ఏమాత్రం తగ్గకుండా రెండో భాగాన్ని తెరకెక్కించేందుకు దర్శకుడు సుకుమార్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
ఈ మూవీకి గాను హీరో బన్నీ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అతడు రూ. 100 కోట్లకు పైగానే పారితోషికం అందుకోనున్నట్టు ఫిల్మ్నగర్ సర్కిల్స్ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అంటే ఇండియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకోనున్నాడన్నమాట. ఈ విషయంలో ప్రభాస్కు ప్రస్తుతం బన్నీ గట్టి పోటీ అయ్యాడనుకోవాలి. అయితే ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ అత్యంత భారీ ప్రాజెక్టులే. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్టు కె. వంటి ప్రతిష్టాత్మక చిత్రాలకు ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంతనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ప్రభాస్ స్థాయికి తగ్గ విజయం దక్కితే మరోసారి అతడే నెంబర్వన్ స్థానంలో నిలిచే అవకాశం ఉంది.