తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్లో సెటిల్ అయిన నటీమణి నిత్యా మీనన్. తన క్యారెక్టర్కు ప్రాముఖ్యత లేకపోతే సినిమాను కూడా ఒప్పుకోని నిత్యా.. ఇటీవల ఓ ఈవెంట్కు వీల్ చైర్లో రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతే కాకుండా తాను సపోర్ట్ లేకుండా నడవలేకపోయింది. దీంతో తనకు ఏం జరిగిందో అందరి ముందు క్లారిటీ ఇచ్చింది నిత్య. నిత్యా మీనన్ చివరిగా తెలుగులో ‘భీమ్లా నాయక్’ సినిమాలో కనిపించింది. ఇందులో మొదటిసారిగా పవన్ కళ్యాణ్తో జోడీకట్టింది. ప్రస్తుతం విజయ్ సేతుపతితో కలిసి ’19 1 (A)’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇటీవల ఈ మూవీ ఫస్ట్ లుక్ కూడా విడుదలయ్యి మంచి రెస్పాన్స్ను అందుకుంది. ఇంతలోనే నిత్యా మీనన్కు ఏమైంది, ఎందుకు వీల్ చైర్పై వచ్చింది అని కంగారుపడుతున్న ఫ్యాన్స్కు అసలు విషయం చెప్పింది. ‘మోడ్రన్ లవ్ ఇన్ హైదరాబాద్’ అనే టైటిల్తో ప్రస్తుతం అమెజాన్ ఓ సినిమాను తెరకెక్కించింది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు నిత్యా మీనన్ వీల్ చైర్పై వచ్చింది. అయితే తాను రెండు రోజుల క్రితం మెట్లపై నుండి జారిపడ్డానని అందుకే ఇలా వీల్ చైర్లో వచ్చానని క్లారిటీ ఇచ్చింది నిత్య. త్వరలోనే తాను ఓకే అయిపోతానని కూడా చెప్పింది. దీంతో తాను త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.