భారతీయ వెండితెరపై ఎలాంటి పాత్రనైనా పోషించగల ప్రతిభావంతుడైన నటుడు కమల్హాసన్. ఆయన హాలీవుడ్లో పుట్టి ఉంటే చాలా ఆస్కార్ అవార్డులు సొంతం చేసుకునేవారని సినీ పండితులు తరచుగా చెప్పే మాట. కమల్ విలక్షణ నటుడు మాత్రమే కాదు.. మంచి దర్శకుడు కూడా. సినిమాల్లో ఆయన చేసిన ప్రయోగాలు ఆ స్థాయి స్టార్డమ్ ఉన్న నటులెవరూ ఎంతమాత్రం చేయడానికి సాహసించరనేది నిస్సంశయం. నటన ద్వారా సంపాదన కంటే తనలోని నటుడిని సంతృప్తిపరచుకోవడానికే కమల్ ప్రాధాన్యం ఇస్తారన్నది అందరికీ తెలిసిన విషయమే. అందుకే పలు ప్రయోగాత్మక చిత్రాలు ఆయన హీరోగా తెరకెక్కాయి. ఇలాంటి ప్రయోగాల్లో భాగంగానే దాదాపు మూడు దశాబ్దాల క్రితం కమల్హాసన్ తన డ్రీమ్ ప్రాజెక్టుగా పేర్కొంటూ మరుదనాయగం అనే పీరియాడికల్ మూవీని తెరకెక్కించే ప్రయత్నం చేశారు. అప్పటి లెక్కల ప్రకారం ఇది ఇండియన్ స్క్రీన్ పై అత్యంత భారీ వ్యయంతో కూడిన ప్రాజెక్టు. ఏక్ దూజ్కే లియే చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టిన కమల్ ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో అక్కడే కొన్ని సినిమాలు చేశాక కొన్ని చిత్రాలు పరాజయం పాలవడంతో అక్కడినుంచి కోలీవుడ్ కు తిరిగివచ్చారు. ఆ సమయంలోనే ఉత్తరాదివారు కూడా అబ్బురపడే స్థాయి సినిమాలను తాను దక్షిణాది నుంచే చేసి చూపిస్తానని, తమ సత్తా ఏంటో బాలీవుడ్కు తెలిసేలా చేస్తానని ఛాలెంజ్ చేసి మరీ తలపెట్టిన కమల్ కలల ప్రాజెక్టు ఇది.
‘మరుదనాయగం’ అనే పోరాట యోధుడి కథకు సెల్యులాయిడ్ రూపం ఇచ్చే ప్రయత్నాల్లో బిజీగా ఉండి కమల్ అప్పట్లో కొన్ని సినిమాలను కూడా వదులుకున్నారు. 1991లో ఈ చిత్రం గురించి ఆయన తొలిసారిగా ప్రకటించగా.. స్క్రిప్టు వర్క్ పూర్తి చేసుకుని ఈ మూవీ షూటింగ్ ప్రారంభించడానికి దాదాపు ఆరేళ్ల సమయం పట్టింది. కమల్ టైటిల్ రోల్ పోషిస్తూ, స్వీయ దర్శకత్వంలో తన సొంత బ్యానర్ రాజ్కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై 1997లో ఈ సినిమాను ప్రారంభించారు. అప్పట్లో ఓ ప్రముఖ అంతర్జాతీయ చిత్ర నిర్మాణ సంస్థ ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా ఉండేందుకు ముందుకొచ్చింది. కాగా చెన్నైలో అట్టహాసంగా జరిగినఈ చిత్రం ప్రారంభోత్సవానికి బ్రిటిష్ రాణి క్వీన్ ఎలిజబెత్ అతిథిగా హాజరయ్యారు. దీనినిబట్టి కమల్ ఈ చిత్రాన్ని ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారో, షూటింగ్ కూడా ప్రారంభం కాకుండానే ఈ చిత్రానికి ఏస్థాయిలో ప్రచారం లభించిందో అర్థం చేసుకోవచ్చు.
ఇక దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు పరిచయమున్న పలువురు బహుభాషానటులను ఈ చిత్రం కోసం కమల్హాసన్ ఎంపిక చేశారు. విష్ణువర్థన్, అమ్రీష్పురి, నసీరుద్దీన్షా, సత్యరాజ్, నాజర్ తదితరులు వీరిలో ఉన్నారు. ఆ తరువాత మూవీలో కొంత భాగం చిత్రీకరణ కూడా జరిగాక ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఈ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచింది. ఆ తరువాత ఈ చిత్రానికి ఊహించని విధంగా కష్టాలు ఎదురయ్యాయి. తలకు మించిన బడ్జెట్ కావడంతో కమల్హాసన్కు ఈ చిత్ర నిర్మాణంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. కొన్నేళ్లపాటు ఈ చిత్రం పైనే దృష్టి పెట్టడం, ఆ సమయంలో ఇతర చిత్రాలను సైతం కమల్ ఒప్పుకోకపోవడం ఆయన కష్టాలను మరింత పెంచింది. ఇదే సమయంలో సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంస్థ ఈ చిత్రం నుంచి తప్పుకోవడం ఈ చిత్రానికి ఆశనిపాతంగా మారింది. దీంతో కమల్ కెరీర్లోలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభమైన మరుదనాయగం సినిమా నిర్మాణం సినీ అభిమానులకు షాక్ ఇస్తూ మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పటికీ ఆ ప్రాజెక్టు ఏమైందో ఎవరికీ తెలియదు.