అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంటిపై ఆ దేశ ఫెడరల్ దర్యాప్తు సంస్థ(ఎఫ్బీఐ) దాడులు నిర్వహించింది. పదవీకాలం ముగిసిన తర్వాత ట్రంప్ వైట్ హౌస్ నుంచి కీలక పత్రాలు తీసుకుపోయారని FBI అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఫ్లోరిడాలోని పామ్ బీచ్లో ఉన్న మార్-ఎ-లాగో నివాసంపై సోదాలు జరిపింది. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. తన ఇంట్లోకి అధికారులు బలవంతంగా చొరబడ్డారని, ఇలాంటి దాడులు వెనకబడిన దేశాల్లోనే జరుగుతాయని ధ్వజమెత్తారు. ఈ మేరకు సుదీర్ఘ ప్రకటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ట్రంప్.. తన ఇంటిని పూర్తిగా నిర్బంధించారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
శ్వేతసౌధాన్ని వీడిన తర్వాత ట్రంప్ ఏవైనా రహస్య పత్రాలను తన వెంట తీసుకెళ్లారా? అన్న విషయంపై అమెరికా న్యాయ శాఖ విచారణ జరుపుతోంది. రహస్య దస్త్రాలను ఫ్లోరిడాలోని తన ఇంటికి తీసుకెళ్లి ఉంటారేమోనని అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎఫ్బీఐ సోదాలు జరగడం గమనార్హం. మరోవైపు, 2021 జనవరి 6 నాటి అల్లర్లపైనా ట్రంప్ విచారణ ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించడం, క్యాపిటల్ భవనంలోకి నిరసనకారులు చొచ్చుకెళ్లేలా ప్రేరేపించడం వంటి ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది.
2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు ట్రంప్ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఎఫ్బీఐ సోదాలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో తనను అడ్డుకునేందుకు డెమొక్రాట్లు ఇలా చేస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. ‘న్యాయవ్యవస్థను ఆయుధంలా మార్చుకుంటున్నారు. డెమొక్రాట్లు నన్ను అధ్యక్ష పదవికి పోటీ పడకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవలి పోల్స్ చూసి ఎలాగైనా రిపబ్లికన్లను నియంత్రించాలని అనుకుంటున్నారు. రాజకీయ కక్షసాధింపులో ఇది అత్యున్నత దశ! అమెరికా ప్రజల కోసం నేను పోరాడుతూనే ఉంటా’ అని ట్రంప్ పేర్కొన్నారు.