ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో అర్ధరాత్రి పర్యటించారు. రాత్రి 11 గంటలకు యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ తో కలిసి శివపూర్-ఫుల్వారియా-లహర్తర రహదారిని పరిశీలించారు. ఇటీవలే ఈ రహదారుల ప్రారంభోత్సవం జరిగింది. ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో 360కోట్లతో ఈ రహదారులను నిర్మించారు.
వారణాసి పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కాశీ హిందూ విశ్వవిద్యాలయంలోని స్వతంత్ర భవన్లో ఎంపీ నాలెడ్జ్ పోటీ, ఎంపీ ఫొటోగ్రఫీ పోటీలు, ఎంపీ సంస్కృతం పోటీల్లో పాల్గొనే వారితో ప్రధాని సంభాషిస్తారని అధికారులు తెలిపారు. రవిదాస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మోదీ బహిరంగ సభలో ప్రసంగిస్తారని అధికారులు తెలిపారు. ఆ తర్వాత కార్ఖియావ్ అమూల్ ప్లాంట్ కాంప్లెక్స్లో రూ.14వేల కోట్లకు పైగా విలువైన 36ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు.