ఇటీవల గుండె వ్యాధులు మరింత పెరిగిపోతున్నాయి. హార్ట్ ఫెయిల్యూర్ కేసులు అధికం అవుతున్నాయి. అప్పటిదాకా హాయిగా ఉన్న వ్యక్తి ఉన్నట్టుండి కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ ముప్పును ముందే గుర్తించగలిగితే ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చని శాస్త్రవేత్తలు చాలాకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా ఓ పరిశోధనలో ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలువడ్డాయి.
హార్ట్ ఫెయిల్యూర్ తో చనిపోయే ప్రమాదాన్ని ఏకంగా ఐదేండ్ల ముందే గుర్తించే పద్ధతిని బ్రిటన్ శాస్త్రవేత్తల బృందం కనుగొంది. ఈ బృందంలో భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ ప్రదీప్ ఝంద్ కీలకంగా వ్యవహరించారు. రక్తంలో ఓ ప్రొటీన్ లెవల్స్ను బట్టి హార్ట్ ఫెయిల్యూర్ ముప్పు ఎంత ఉందన్నది తెలుసుకోవచ్చని చెప్పారు. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్, యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గోలకు చెందిన పరిశోధకుల బృందం సంయుక్తంగా 800 మంది వాలంటీర్లపై పదేండ్లపాటు ఈ స్టడీ నిర్వహించింది. ‘ప్రస్తుతం రక్తంలో బీ టైప్ నాట్రీయూరేటిక్ పెప్టైడ్(బీఎన్ పీ) ప్రొటీన్ స్థాయిలను లెక్కించడం ద్వారా హార్ట్ ఫెయిల్యూర్ ముప్పును గుర్తిస్తున్నారు. అయితే, ఎన్ పీవై ప్రొటీన్ స్థాయిలను లెక్కించడం ద్వారా ఈ ముప్పును ఐదేండ్ల ముందే గుర్తించవచ్చని మా స్టడీ తేల్చింది” అని ప్రొఫెసర్ ప్రదీప్ చెప్పారు.