పీకే కౌటిల్యంతో తెలంగాణ కాంగ్రెస్ క్యాడర్లో నెలకొన్న అయోమయాన్ని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా తొలగించారు. కొద్ది రోజుల క్రితం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అటు కాంగ్రెస్ అధిష్ఠానంతోనూ, ఇటు టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వంతోనూ చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అంతేకాదు బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలతో పొత్తులకు సిద్దం కావాలని, తెలంగాణలో టీఆర్ఎస్తో కలిసి పోటీ చేయాలని కూడా సూచించారు. దీనితో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులతోపాటు క్యాడర్ కూడా అయోమయానికి లోనైన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్కు బలమైన ప్రత్యర్థిగా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ కొనసాగుతోంది. అతేకాదు వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం బలంగా నమ్ముతోంది. ఈ సమయంలో అలాంటి చర్చ పార్టీ శ్రేణుల ఉత్సాహాన్ని నీరుగార్చేదే.
అయితే శుక్రవారం హనుమకొండలో జరిగిన రైతు సంఘర్షణ సభలో రాహుల్గాంధీ మాట్లాడుతూ టీఆర్ఎస్ పై సమరానికి సిద్ధం కావాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అంతేకాదు.. ఇతర పార్టీలతో లాలూచీ పడి నాటకాలాడే నాయకులకు కాంగ్రెస్ పార్టీలో చోటుండదని నిత్య అసమ్మతి నాయకులకు గట్టి హెచ్చరిక చేశారు. చాలాకాలంగా రాష్ట్రంలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు పార్టీకి శాపంగా మారిన విషయం తెలిసిందే. ఇకపై ఈ తరహా అసమ్మతి నేతలను భరించేది లేదని రాహుల్ స్పష్టంగా తేల్చి చెప్పారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వంపైనా రాహుల్ పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు. తెలంగాణ ఏ ఒక్కరి కారణంగానో రాలేదని, లక్షలాది యువకుల పోరాటం, ఆకాంక్షల ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని గుర్తుంచుకోవాలన్నారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి రాజకీయంగా నష్టం కలుగుతుందని తెలిసినా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధపడిందన్నారు. కానీ గత ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, కేవలం ఒక్క కుటుంబ ప్రయోజనాల కోసమే ఇక్కడి ప్రభుత్వం పనిచేస్తోందని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ రాచరికంలో ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ. 2 లక్షల రుణ మాఫీ
ఇక ఈ సభ సందర్బంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని ప్రకటించారు. ఇది కేవలం ప్రకటన కాదని, కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న గ్యారంటీ అని ఆయన స్పష్టం చేశారు. డిక్లరేషన్ అమలు కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ వారికి దగ్గరగా ఉన్నవారికే పార్టీ టికెట్లు ఇస్తామని తేల్చి చెప్పారు. టీఆర్ఎస్, బీజేపీ లోపాయికారీ అవగాహనతో పని చేస్తున్నాయని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.