నరేంద్రమోదీ ప్రధాని పీఠాన్ని అధిష్ఠించాక ఈ ఎనిమిదేళ్ల కాలంలో సంచలన నిర్ణయాలు చాలానే తీసుకున్నారు. పెద్ద నోట్ల రద్దు, కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ పై నిషేధం వంటివి వీటిలో కొన్ని మాత్రమే. ఇప్పుడు మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం మరో భారీ నిర్ణయం తీసుకోనుందా..? కర్ణాటక పౌర సరఫరాల మంత్రి ఉమేష్ కత్తి తాజాగా చేసిన వ్యాఖ్యలు దీనినే సూచిస్తున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల తరువాత కర్ణాటక రెండు రాష్ట్రాలుగా విడిపోనుందని, ఈ దిశగా ప్రధాని నరేంద్రమోదీ యోచిస్తున్నారని మంత్రి ఉమేష్ మంగుళూరులో జరిగిన కార్యక్రమంలో తెలిపారు. అంతేకాదు.. ఉత్తర ప్రదేశ్ లో మరో నాలుగు, మహారాష్ట్రలో మూడు రాష్ట్రాలు సహా దేశం మొత్తం 50 రాష్ట్రాలుగా మారనుందని ఆయన వ్యాఖ్యానించారు. ఉత్తర కర్ణాటక ఏర్పాటు కోసం ప్రజలంతా పోరాడాల్సిన సమయం ఇదేనని కూడా ఆయన పిలుపునిచ్చారు.
కాగా మంత్రి ఉమేష్ వ్యాఖ్యలపై మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య స్పందిస్తూ కర్ణాటకను విభజించాలన్న ప్రధాని ఉద్దేశం ఆ మంత్రి ద్వారా వెల్లడైందని, ఇదో ప్రమాదకరమైన పరిణామమని, దీనిపై ప్రధాని కార్యాలయం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై మాత్రం మంత్రి ఉమేష్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని కొట్టిపారేశారు. ఉత్తర కర్ణాటక ఏర్పాటు మంత్రి అభిమతమని, గతంలోనూ పలుసార్లు ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారని తెలిపారు. కర్ణాటక విభజనపై ప్రస్తుతం ఎలాంటి ప్రతిపాదన లేదని చెప్పుకొచ్చారు.
అయితే ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రంలో పర్యటించి వెళ్లిన రోజుల వ్యవధిలోనే కర్ణాటక మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆషామాషీగా చేసినవిగా కొట్టి పారేయలేమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రధాని మోదీ మరో సంచలన నిర్ణయం తీసుకోవడం ద్వారా విపక్షాల ఊహకందని విధంగా దేశ రాజకీయాలను మార్చివేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు సైతం చెపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక మంత్రి ఉమేష్ వ్యాఖ్యలు అటు రాజకీయ వర్గాల్లోను, ఇటు ప్రజల్లోను సంచలనం సృష్టిస్తున్నాయి.