ఆధునీకయుగంలోనూ మూఢ నమ్మకాలు వదలడంలేదు. ముఖ్య0గా యూపీ వంటి రాష్ట్రాలలో ఇవి మరీ ఎక్కువగా ఉన్నాయి…
సాధువుల సలహాతో మోక్షంతోపాటు డబ్బు పొందేందుకు ఒక వ్యక్తి సజీవంగా సమాధి అయ్యేందుకు ప్రయత్నించాడు. పోలీసులకు ఈ విషయం తెలియడంతో ఆరు అడుగుల లోతులో భూమి లోపల ఉన్న ఆ వ్యక్తిని రక్షించారు. ఆ వ్యక్తితోపాటు ఆ సలహా ఇచ్చిన ముగ్గురు సాధువులను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అసివాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాజ్పూర్ గ్రామానికి చెందిన శుభం గోస్వామికి ముగ్గురు సాధువులు ఒక సలహా ఇచ్చారు. శరన్నవరాత్రులు ప్రారంభం ముందు రోజున సమాధిలో కూర్చుంటే మోక్షం, జ్ఞానోదయంతో పాటు డబ్బులు లభిస్తాయని చెప్పారు. ఇది నమ్మిన గోస్వామి ఆరు అడుగుల లోతులో తవ్విన గోతిలోకి దిగాడు. ఆ గొయ్యిపై కర్రల ఆసరాతో మట్టిని కప్పారు. స్థానికుల ద్వారా ఈ విషయం తెలిసిన పోలీసులు వెంటనే ఆ సమాధి వద్దకు చేరుకొని, మట్టిని తొలగించారు. గోతి లోపల ఉన్న గోస్వామిని బయటకు తీశారు. సమాధి కావాలని చెప్పిన ముగ్గురు సాధువులతోపాటు సమాధిలో కూర్చొన్న గోస్వామిని కూడా అరెస్ట్ చేశారు. కాగా, సమాధిలో ఉన్న ఆ వ్యక్తిని పోలీసులు రక్షించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.