‘రెండు సార్లు వెన్నుపోటు పొడిపించుకున్న చేతకాని దద్దమ్మ ఎన్టీఆర్..’ అని రాష్ట్ర మంత్రి దాడిశెట్టి రాజా దారుణంగా విమర్శలు చేసారు. తుని ఎమ్మెల్యే అయిన రాజా చేసిన ఈ వ్యాఖ్యలపై టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఏ మాత్రం స్పందించలేదు. దీనిపై టీడీపీ కేడర్ లో సైతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన స్థాయి నాయకులపై మాత్రమే తాను స్పందిస్తానని యనమల చెపుతారని.. భావించినా .. ఇపుడు రాజా జగన్ కేబినెట్ లో కీలక ఆర్ అండ్ బి మంత్రి. 2014, 2019 లో వరుసగా రెండు దఫాలు తుని నుంచి గెలుపొందారు.
1983లో ఎన్టీఆర్ యనమల రామకృష్ణుడుకి తుని అసెంబ్లీ సీటు ఇచ్చి మంత్రిని చేసి రాజకేయ బిక్ష పెట్టారు. ఎన్టీఆర్ వంటి మహనీయుడిని ఆకతాయిగా మాట్లాడిన మంత్రి వ్యాఖ్యలపై కనీసం యనమల కౌంటర్ ఇవ్వకపోవడంపై తెలుగుదేశం పార్టీ కేడర్ తో పాటు రాజకీయ వర్గాలలోనూ చర్చ నడుస్తోంది. గతంలో 2019 ఎన్నికల ముందు.. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ .. ఏపీ వచ్చి చంద్రబాబు నాయుడుపై ఘాటైన వ్యాఖ్యలు చేసారు. ఆ సమయంలో కూడా యనమల స్పందించలేదు. ఇలాంటివి ఏవీ అతనికి పట్టవు. అయినా పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం.. గెలవకుండానే మంత్రి పదవి ఇస్తారు.. అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై కూడా పార్టీలో మెజార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కీలక నేతలైన యనమల వంటి వారి ఇలాంటి పోకడల వల్లే టీడీపీకి నష్టం జరుగుతోంది.. పార్టీ కేడర్ లో చులకన భావన ఏర్పడుతోంది.. అని ఓ సీనియర్ నేత వ్యాఖ్యనించారు.