తిరుమల శ్రీవారి ప్రతిబింబమైన శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమమీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం జరిగింది. శ్రీనివాస మంగాపురంలో వెలసిన శ్రీకళ్యాణి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి, అనంత, గరుడ, విష్వక్సేనుల వారిని, గరుడ పటాన్ని ఆలయ ప్రాంగణంలో ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్దకు తీసుకొచ్చారు.
వేద మంత్రాల నడుమ ధ్వజస్తంభానికి పూజలు చేశారు. అనంతరం మీన లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. తొమ్మిది రోజులు పాటు నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.