”ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ-జనసేన తో పొత్తు అంశం తేలకపోతే పార్టీ కార్యక్రమాలు నిర్వహించరా?? పొత్తు ఉంటేనే రాజకీయం చేస్తారా? లేకపోతే ఆంధ్రాలో పార్టీని గాలికి వదిలేస్తారా?” అంటూ ఆర్ఎస్ఎస్ ముఖ్య నేతలు ఏపీ బీజేపీ పెద్దలకు చీవాట్లు పెట్టినట్లు తెలిసింది. .. పొత్తు అంశం తేలే వరకు పార్టీ కార్యక్రమాలు ఎందుకు? అన్న ఉద్దేశ్యంతో మిన్నకుండిపోయిన పలు పార్లమెంట్ స్థానాలలో నేతలకు, ఏపీ బీజేపీ కీలక నేతలకు ఆర్ఎస్ఎస్ నుంచి తాఖీదులు అందినట్లు చెప్పుకుంటున్నారు.
ఆ రెండు చోట్లే: ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పుంజుకుంటున్నా… పార్టీ నేతల వ్యవహార శైలితో జనంలోకి వెళ్లడంలేదన్నది ఆర్ఎస్ఎస్ వాదన. ఆంధ్రప్రదేశ్ లో హిందూపూర్ , ఏలూరు పార్లమెంట్ స్థానాల పరిధిలో పార్టీ కార్యక్రమాలు జనంలోకి తీసుకువెళుతున్నారని ఆర్ఎస్ఎస్ పెద్దలు భావిస్తున్నారు. హిందూపురంలో శ్రీ పీఠం స్వామి పరిపూర్ణానంద ఇప్పటికే ఏడూ అసెంబ్లీ సెగ్మెంట్స్ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. హిందూ ధార్మిక కార్యక్రమాలు చేపడుతూ పరిపూర్ణానంద దూసుకుపోతున్నారు.
ఏలూరులో చౌదరి: ఏలూరు పార్లమెంట్ పరిధిలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏలూరు ఇంచార్జ్ గారపాటి సీతారామాంజనేయ చౌదరి రెండేళ్లుగా కమలం గుర్తును, మోదీ పధకాలను ప్రజలలోకి విస్తృతంగా తీసుకువెళుతున్నారు. రహదారుల కూడళ్లలో .. మోదీ పధకాలను వివరిస్తూ..భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేసి విస్తృత ప్రచారం చేస్తున్నారు. తపన ఫౌండేషన్ పేరుతో 16 ఏళ్లుగా ఏలూరు పరిసరాలలో సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న చౌదరి… రెండేళ్లుగా బీజేపీ కార్యక్రమాలను కేంద్ర పధకాలను, పదేళ్ల బీజేపీసర్కార్ అప్రతిహత విజయాలను ప్రజలలోకి విస్తృతంగా తీసుకువెళ్లడంలో సక్సెస్ అయ్యారు.
విశాఖపట్నంలో జీవీఎల్ నరసింహారావు, అరకు పరిధిలో కొత్తపల్లి గీత తదితర నేతలు కొంత మేర కమలం గుర్తును జనంలోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు.
మిగిలిన చాలా పార్లమెంట్ ఏరియాల పరిధిలో నాయకులు మాత్రం.. అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేస్తామంటూ ఆర్బాటంగా ప్రకటనలు చేస్తున్నారు. పొత్తు కుదిరిన పక్షంలో మాత్రమే పార్టీ కార్యక్రమాలు చేపడదామని మరికొన్ని చోట్ల నేతలు ఎదురు చూస్తున్నారు.
సమయం సరిపోదు కదా.. పొత్తు కుదిరిన పక్షంలో ఎన్నికలకు ఈ రెండు నెలలే సమయం ఉంటుంది కదా.. సమయం సరిపోతు0దా .. పొత్తు ఉన్నా-లేకపోయినా మన పని మనం చేసుకుపోవాలి కదా.. అని ఆర్ఎస్ఎస్ నేతలు ఏపీ నేతలకు సూచిస్తున్నారు. అయితే వీరిలో మెజార్టీ నేతలు వారి సూచనలు, ఆదేశాలు పెడచెవిన పెడుతున్నారు.