తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయ ఉత్తరమాడ వీధిలోని శ్రీనమ్మాళ్వార్ సన్నిధి వద్ద గురువారం ఉదయం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి నిత్యాన్నదాన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో భూమన కరుణాకర రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ రోజు నుంచి రోజుకు రెండువేల మంది భక్తులకు సరిపడేలా శ్రీగోవింద రాజస్వామి ఆలయం వద్ద నిత్యాన్నదానం ఏర్పాటు చేస్తామని కరుణాకరరెడ్డి చెప్పారు. తిరుమలలో రోజూ లక్ష మంది నిత్యాన్నదాన పథకం ద్వారా భోజనం చేస్తున్నారు.. గతంలో నేను టీటీడీ పాలక మండలి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు తిరుమల వచ్చిన ప్రతి భక్తుడూ అన్నదానంలో భోజనం తినే ఏర్పాటు చేశాం.. అదే సమయంలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద కూడా నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాం.. తర్వాత ఒంటిమిట్టలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం.. ఈ రోజున తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయం వద్ద ప్రారంభించడం సంతోషంగా ఉంది.. ఇక్కడ ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది..
ఈ సందర్భంగా నాకు నా చిన్నతనం నాటి రోజులు గుర్తుకొస్తున్నాయి.. నా చిన్నతనంలో సాయంత్రం పూట ఇక్కడ అన్నప్రసాదం కోసమని వచ్చిన సందర్భాలు పదుల సంఖ్యలో ఉన్నాయి.. అలాంటిది ఈ రోజు నేనే, టీటీడీ పాలక మండలి అధ్యక్షుడిగా శ్రీగోవిందరాజు స్వామి ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం మనసుకు చాలా చాలా ఆనందంగా ఉంది.. భవిష్యత్తులో దీన్ని మరింతగా విస్తరిస్తామని భూమన అన్నారు.