తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి సన్నిధిలో వసంతోత్సవాలు ప్రారంభమయ్యాయి. వసంత రుతువులో స్వామికి నిర్వహించే ఈ ఉత్సవమే వసంతోత్సవం. ఎండ వేడి నుంచి స్వామి ఉపశమనం పొందేందుకు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. దీనిని ఉపశమనోత్సవం అని కూడా అంటారు. ఈ వేడుకల కోసం మండపాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. శేషాచల అడవిని తలపించేలా ఈ మండపాన్ని తీర్చిదిద్దారు. ఈ ఉత్సవంలో సుగంధాన్ని వెదజల్లే పుష్పాలు, ఫలాలను శ్రీవారికి నివేదిస్తారు.
నాలుగున స్వర్ణ రథోత్సవం
ఈ వసంతోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు స్వామి మాఢ వీధుల్లో స్వర్ణ రథంపై ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. ఐదున బుధవారం శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామికి ఉత్సవం నిర్వహిస్తారు.