ఏపీ ప్రజలు ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలి.. నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎన్నికలు జరగడం పక్కా అని ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు. వైయస్సార్ పార్టీకి చెందిన 30 మంది ఎమ్మెల్యేల పని తీరు బాగాలేదని, ముఖ్యమంత్రి జగన్ ఫైర్ అయ్యారు.. ప్రజల మన్నన లేకపోతే కష్టం అని పార్టీ కార్యకర్తలకు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వారికి టికెట్ నిరాకరిస్తారని ఎంపీ చెప్పుకొచ్చారు. రేపో మాపో ఈ పార్టీ నుంచి వెళ్లిపోయే వాడిని.. అయినా ప్రస్తుతం పార్టీలో కొనసాగుతున్న సభ్యుడిగా మంచి చెప్పే ప్రయత్నం చేస్తున్నానన్నారు. అయితే ఏపీ ప్రజలు బయటకు చెప్పడానికి భయపడుతున్నప్పటికీ రానున్న ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో డిసైడ్ అయిపోయారని చెప్పారు.
రాజధాని అమరావతి ప్రాంతంలో మాస్టర్ ప్లాన్ కు భిన్నంగా.. కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్ల అభ్యర్థనతో 24 గంటల వ్యవధిలో 1100 చిల్లర ఎకరాల భూమిని జగనన్న ఇళ్ల స్థలాల పంపిణీకి సీఆర్డీఏ కమిషనర్ శ్రీలక్ష్మి కేటాయించడం ఆశ్చర్యాన్ని కలిగించింది అన్నారు. రైతులను వేధించాలనే ఉద్దేశ్యంతోనే రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలను కేటాయించాలని నిర్ణయించారని అన్నారు. మాస్టర్ ప్లాన్ కు భిన్నంగా ఎటువంటి నిర్ణయాలను తీసుకోరాదని ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసిందని.. ఈ తప్పును ఎత్తి చూపడానికి ప్రతిపక్షాలకు ప్రస్తుతం ఓట్ల భయం పట్టుకుందని.. ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇస్తామంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్నారని.. పేదలకు ఇల్లు ఇవ్వడం మంచిదా?, ఆపడం మంచిదా అంటూ జగన్ ఇప్పటికే ప్రజల్లో తప్పుడు ప్రచారాన్ని చేశారన్నారు.
పార్టీలో కొనసాగలేకపోతున్నా.. ప్రజలకు సేవ చేయడానికి ఈ పదవిలో ఉండాల్సి వస్తోందని వాపోయారు. అయితే ఈ పదవి తనకు తాను తెచ్చుకున్నది అన్నారు. కాని ఈ పార్టీలో ఉండడానికి సిగ్గు పడుతూనే ఉంటానని.. చేసిన తప్పుకు తనను తాను తిట్టుకుంటూ, పార్టీలో కొనసాగుతాను అన్నారు. ఆరు నెలల వ్యవధిలో ఎన్నికలు వస్తాయని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ అమలు చేస్తామని ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రకటించారన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎన్నో ఉన్నాయని.. వాటన్నింటిని కూడా రాష్ట్రంలో అమలుకు చర్యలు తీసుకుంటారన్నారు. దుగ్గిరాలలో ఒక యువకుడు తన ప్లెక్సీని ఏర్పాటు చేస్తే ఆయన్ను స్టేషన్ కు పిలిచి చితకబాదారని.. రానున్నది తమ ప్రభుత్వమేనని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు. తన ప్లెక్సీని ఏర్పాటు చేస్తే వారికి వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు.