ప్రముఖ దేశీయ కంపెనీ పతంజలి ని అప్రతిష్టపాలు చేయడమే ఎజెండాగా పెట్టుకుని దుష్ప్రచారం జరుగుతోందని ఆ కంపెనీ సహ-వ్యవస్థాపకుడు, యోగా గురు రాందేవ్ బాబా (Ramdev Baba) అన్నారు. హరిద్వార్లో బుధవారంనాడు మీడియాతో ఆయన మాట్లాడుతూ, పతంజలిని సుప్రీంకోర్టు మందలించినట్టు మంగళవారం నుంచి వివిధ ప్రసార మాధ్యమాల్లో ఒక వార్త వైరల్ అవుతోందని చెప్పారు. అయితే, తప్పుడు ప్రచారం చేస్తే జరిమానా పడుతుందని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పిందని రాందేవ్ బాబా చెప్పుకొచ్చారు. అత్యున్నత న్యాయస్థానం పట్ల తమకు గౌరవం ఉందని చెప్పారు. పతంజలి ఎలాంటి తప్పుడు ప్రచారం చేయదని ఆయన వివరణ ఇచ్చారు. కొందరు డాక్టర్లు ఒక గ్రూపుగా ఏర్పడి నిరంతరం యోగ, ఆయుర్వేదంపై తప్పుడు ప్రచారం సాగిస్తున్నట్టు ఆయన ఆరోపించారు. ”మేమే అబద్ధాలు చెప్పే వాళ్లమైతే మాకు రూ.1000 కోట్లు జరిమానా వేయండి. మరణశిక్ష (Deth penalty)కి కూడా సిద్ధంగా ఉన్నారు. మేము అబద్ధాలు చెప్పని వాళ్లమైతే తప్పుడు ప్రచారం సాగిస్తున్న వారిని శిక్షించండి” అని రాందేవ్ బాబా అన్నారు. పతంజలి విడుదల చేసే ఆయుర్వేద ఉత్పత్తులకు అవసరమైన క్లినికల్ ఎవిడెన్స్ ఉందని చెప్పారు. ఎవరైనా పరీక్షించుకోవచ్చని స్పష్టం చేసారు.