ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ప్రపంచ కుబేరుల లిస్టులో నాలుగో వ్యక్తిగా కొనసాగుతున్న గౌతమ్ ఆదానీ మరో వ్యాపారంలోకి తన పారిశ్రామిక సామ్రాజ్యాన్ని విస్తరించనున్నారు. అల్యూమినియం రంగంలోనూ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు తాజాగా ఆదానీ గ్రూప్ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఒడిశాలో 5.2 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.41.30 వేల కోట్ల వ్యయంతో అల్యూమినా శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. గడచిన కొన్నేళ్లుగా ఆదానీ గ్రూప్ పలురంగాల్లోకి భారీ ప్రణాళికలతో విస్తరిస్త్తూవస్తున్న విషయ తెలిసిందే. ఇప్పుడు అల్యూమినియం రంగంలోకి అడుగుపెట్టడం ద్వారా ఆ రంగంలో ఇప్పటికే ప్రముఖ కంపెనీలుగా ఉన్న బిర్లా గ్రూప్నకు చెందిన హిండాల్కో, ప్రభుత్వ రంగంలోని నాల్కో, వేదాంత గ్రూప్లో భాగమైన భారత్ అల్యూమినియం, జిందాల్ అల్యూమినియం వంటి కంపెనీలకు గట్టి సవాల్ విసరబోతున్నదనే చెప్పాలి.
విలువ పరంగా టాటా గ్రూప్దే ఇప్పటికీ అగ్రస్థానం
విలువ పరంగా ఇప్పటికీ భారత్కు చెందిన అత్యంత పెద్ద పారిశ్రామిక సంస్థగా టాటా గ్రూప్ తన అగ్రస్థానాన్ని కాపాడుకుంటూ వస్తోంది. 2021 నాటికి టాటా గ్రూప్ నుంచి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ సుమారు 23,5 లక్షల కోట్లుగా ఉంది. టాటా గ్రూప్లో అత్యంత విలువైన కంపెనీగా టీసీఎస్ నిలుస్తోంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ ఒకసమయంలో రూ. 14 లక్షల కోట్లుగా నమోదైంది. ప్రస్తుతం ఉన్నషేర్ ధరను పరిగణనలోకి తీసుకుంటే దాదాపు రూ. 12 లక్షల కోట్లుగా ఉంది.
అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్
ఇక దేశంలో అత్యంత విలువైన కంపెనీగా నిలిచిన ఘనతను రిలయెన్స్ ఇండస్ట్రీస్ దక్కించుకుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.
17 లక్షల కోట్లుగా ఉంది. అయితే టాటా, రిలయన్స్ వంటి రెండు అతిపెద్ద పారిశ్రామిక గ్రూపులకు కూడా సాధ్యం కానంత శరవేగంగా ఆదానీ గ్రూపు గత ఐదారేళ్లలో ఎదగడం గమనార్హం. వ్యక్తిగతంగా భారత్నుంచి అత్యంత సంపన్నుడిగా కూడా ఈ ఏడాది తొలిసారిగా గౌతమ్ ఆదానీ ఆవిర్భవించారు. ఆ తరువాత బిల్గేట్స్ను సైతం వెనక్కు నెట్టి ప్రపంచంలో నాలుగో సంపన్న వ్యక్తిగానూ నిలిచారు. కాగా ఆదానీ తమ సంస్థల భవిష్యత్ వ్యాపార విస్తరణకు సంబంధించి భారీ ప్రణాళిలను కూడా ప్రకటించారు. ఇప్పటికే సీ పోర్టులు, విమానాశ్రయాలు, కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ తదితర రంగాల్లో అగ్రస్థానం కోసం పోటీ పడుతున్న ఆదానీ గ్రూప్ మైనింగ్, సంప్రదాయేతర విద్యుదుత్పత్తి, తదితర రంగాల్లో భారీ పెట్టుబడులకు సిద్ధమవుతోంది.