ఆసియా ఖండంలోనే అత్యంత సంపన్నుడైన (Indias richest person) అంబానీ ఇంట్లో ఏం జరిగినా, ఆయన ఏ పని చేసినా అదో సెన్సేషనల్. అంబానీ ఫ్యామిలీ గురించి రోజుకో వార్త చక్కర్లు కొడుతుంటుంది. ఆయన తినే ఆహారం, వాడే కార్లు, ధరించే దుస్తులుతోపాటు అంబానీ ఇంట్లో పనిచేసే వాళ్ల జీతాలు, కారు డ్రైవర్ జీతం, చెఫ్ జీతం, పెంపుడు కుక్క ఇలా ఏదో ఒకటి న్యూస్ సర్కిల్లో తెగ చక్కర్లు కొడుతుంటుంది. తాజాగా అంబానీకి సంబంధించి మరో వార్త ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది.
అదేంటంటే..? ఈ బిలయనీర్ తన దగ్గర సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఓ ఉద్యోగికి అత్యంత విలువైన బహుమానం అందించారట. అయితే ఆ బహుమతి ఖరీదు రూ.వేలు, రూ.లక్ష, రూ.కోటి కాదండోయ్..! ఏకంగా రూ.వేల కోట్లంట..! ఆ ఉద్యోగి పేరు మనోజ్ మోడీ (Manoj Modi). ఆయన చాలా కాలంగా రిలయన్స్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నారు. పైగా ఆయన్ని ముకేశ్ అంబానీకి రైట్ హ్యాండ్ (right hand)గా చెప్పుకుంటుంటారు. ఎన్నో ఏండ్లుగా కంపెనీలో నమ్మకంగా పనిచేస్తున్న మనోజ్ సేవలను గుర్తించిన ముకేశ్ అంబానీ.. ఆయనకు ఏకంగా రూ.1,500 కోట్ల విలువ చేసే 22 అంతస్తుల ఇంటిని గిఫ్ట్గా ఇచ్చారట.
ఖరీదైన ఇంటి వివరాలు..
ఈ విలాసవంతమైన ఇల్లు ముంబై (Mumbai)లోని నేపియన్ సీ రోడ్డు ( Nepean Sea Road ) ప్రాంతంలో ఉంది. ఈ ఇంటిని తలతి అండ్ పార్ట్నర్స్ ఎల్ఎల్పీ (Talati & Partners LLP ) డిజైన్ చేసింది. బృందావన్ పేరుతో మొత్తం 1.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. ఇందులో ఒక్కో అంతస్తు 8 వేల చదరపు అడుగుల వైశాల్యంలో ఉంది. ఈ ప్రాంతంలో చదరపు అడుగు ధర రూ.45,100 నుంచి రూ.70,600 వరకు పలుకుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఈ 22 అంతస్తుల భవంతి ధర రూ.1500కోట్ల వరకు ఉంటుందట. ఈ భవనంలో 7 అంతస్తులు కేవలం పార్కింగ్ కోసమే కేటాయించారట. ఇక ఈ ఇంట్లో వాడిన ఫర్నీచర్ ఇటలీ నుంచి దిగుమతి చేసినట్లు సమాచారం. ఈ ఇంట్లోని కొన్ని అంతస్తుల్లో మనోజ్ మోడీ కుటుంబంతో నివసించనుండగా.. మరికొన్ని అంతస్తుల్లో ఆయన ఇద్దరు కుమార్తెలు వారి కుటుంబంతో ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఎవరీ మనోజ్ మోడీ..
మనోజ్ మోడీ (Manoj Modi).. ముకేశ్ అంబానీ చిన్ననాటి స్నేహితుడు. ముంబయిలోని యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో ఇద్దరూ కలిసి చదువుకున్నారు. ఇక అప్పటి నుంచి మనోజ్కు అంబానీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 1980లో మనోజ్.. రిలయన్స్ ఇండస్ట్రీస్లో చేరారు. ఆ సమయంలో ధీరూభాయ్ అంబానీ రిలయన్స్కు నేతృత్వం వహిస్తున్నారు. మనోజ్ మోడీ తండ్రి హరిజీవందాస్ కూడా ముఖేష్ తండ్రి ధీరూభాయ్తో కలిసి పనిచేశారు.
రిలయన్స్ ఇతర కంపెనీలతో చేసుకున్న రూ.వందల కోట్ల ఒప్పందాల్లో మనోజ్ అత్యంత కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ముకేశ్ అంబానీ, ఇషా అంబానీ, ఆకాష్ అంబానీతో కలిసి మనోజ్ పనిచేస్తున్నారు.