ప్రముఖ టెక్ దిగ్గజం విప్రోలో ఉద్యోగాలకు ఎంపికైన ఫ్రెషర్లకు బాధ్యతలు అప్పగించడంలో (ఆన్బోర్డింగ్) జాప్యం జరుగుతోందన్న ఆరోపణలపై సంస్థ మానవ వనరుల విభాగం అధిపతి సౌరభ గోవిల్ తాజాగా స్పందించారు. ఈ అంశంలో సంస్థ అత్యంత పారదర్శకంగా, న్యాయబద్ధంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. ఆన్బోర్డింగ్లో జాప్యం, ఫ్రెషర్ల జీతాల్లో కోతలు తదితర సమస్యలు ఇటీవల కాలంలో విప్రోను చుట్టుముట్టిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, పనితీరు సరిగా లేదన్న కారణంతో విప్రోలో కొందరు ఫ్రెషర్లను తొలగించారన్న వార్త కూడా వైరల్ అయ్యింది.ప్రస్తుత పరిస్థితుల్లో ఫ్రెషర్ల జీతాలు పెంచే అవకాశం లేదని సౌరభ్ స్పష్టం చేశారు. ఈ ఏడాడి విప్రో క్యాంపస్ ఇంటర్వ్యూలు చేపట్టని విషయాన్ని కూడా గుర్తుచేశారు. ‘‘ప్రస్తుతం అవసరాలకు మించి ఫ్రెషర్లు అందుబాటులో ఉన్నారు. మా వద్ద కూడా తగినంత మంది ఉన్నారు. ఇప్పటికే ఆఫర్ లేటర్ ఇచ్చిన వారిని ఉద్యోగంలోకి తీసుకుకోవడమే మాముందున్న ప్రథమ కర్తవ్యం’’ అని క్లారిటీ ఇచ్చారు.