మాజీ ఎమ్మెల్యే దివంగత బొడ్డు భాస్కర రామారావు తనయుడు వెంకట రమణ చౌదరి టీడీపీ లో చేరేందుకు రంగం సిద్ధం అవుతోంది. అయితే ఎలాంటి హామీ లేకుండానే బొడ్డు తనయుడు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఎందుకు రెడీ అవుతున్నారు..? అన్న చర్చ రాజకీయ వర్గాలలో తెరపైకి వచ్చింది. వైసీపీలో ఉన్నా ఆ పార్టీ నేతలు పట్టించుకోకపోవడం ఒక కారణమైతే.. వ్యాపార పరంగా ఎదురవుతున్న ఇబ్బందులు మరో కారణంగా చెప్పుకుంటున్నారు. కాకినాడ సమీపంలో ‘మేడలైన్” పేరుతో ఉన్న ప్రాంతంలో బొడ్డు , మరి కొంతమందితో కలసి భారీ రియల్ ఎస్టేట్ బిసినెస్ స్టార్ట్ చేసారు. కొన్ని ఆటంకాలు ఎదురై ఆ ప్రాజెక్ట్ బ్రేక్ పడింది. వైసీపీ ఎలాగూ దీనికి సహకరించడంలేదన్న కారణంగా .. వచ్చే ఎన్నికలో టీడీపీ అధికారంలోకి వస్తే అపుడైన ఈ ప్రాజెక్ట్ ని చేయించుకోవచ్చన్న ఉద్దేశంతోనే పార్టీ మారుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
బొడ్డు వెంకట రమణ చౌదరి. 2014 లో రాజమండ్రి లోక్ సభ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి ఓడిపోయారు. 2019 లో మళ్ళీ టికెట్ ట్రై చేసి విఫలమయ్యారు. వైసీపీలో తనకేమాత్రం ప్రాధాన్యత లేదని భావించిన చౌదరి.. ఇపుడు పార్టీ మారడానికి రెడీ అయ్యారు. పాత తూర్పు గోదావరి జిల్లాలో తరచూ పార్టీలు మారితే రాజకీయ అవకాశాలు దక్కే ఛాన్స్ చాలా తక్కువ. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబును కలిసినా ఏ హామీ లభించలేదు.
రాజకీయ ప్రత్యర్థులతో వెళ్లి..
రాజకీయాల్లో పదవులు ఒక్కటే ముఖ్యం కాకూడదు. వేసే ప్రతి అడుగు హుందాగా ఉంటేనే ఏ నాయకుడికైనా గౌరవం. “బొడ్డు భాస్కర్ రామారావు నాకు శత్రువు” అని మంత్రిగా ఉన్న సమయంలో చిన రాజప్ప ప్రకటించారు. ఇపుడు ఆ రాజప్ప వెనుకే చౌదరి … చంద్రబాబు వద్దకు వెళ్లడం.. రాజకీయ వర్గాలలో చర్చకు దారి తీసింది. టీడీపీ జనరల్ సెక్రెటరి లోకేష్ ను కలిసేందుకు… బొడ్డు వెంకట రమణ ప్రయత్నించారు. ‘పార్టీలో లేని వారిని నేనెలా కలుస్తాను..’ అని లోకేష్ ఆయనకు అపాయింట్మెంట్ నిరాకరించినట్లు సమాచారం. 2014 నుంచీ రాజకీయ శత్రువులుగా ఉన్న పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప, అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి లతో కలసి చంద్రబాబు ను కలవాల్సి వచ్చింది. అంటే పరిస్థితి అర్ధం చేసుకోవాలి. బొడ్డు సొంత నియోజకవర్గం అనపర్తి లో పార్టీ బలోపేతానికి సిన్సియర్ కార్యకర్తగా పనిచేయాలని చంద్రబాబు దిశా నిర్దేశం చేయడంతో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. మే 3 వ తేదీన మంగళగిరిలో చంద్రబాబు సమక్షములో టీడీపీ తీర్థం తీసుకునేందుకు బొడ్డు రెడీ అవుతున్నారు. అయితే ఆయనతో వెంట వెళ్లేందుకు పెద్దాపురం, అనపర్తి నియోజక వర్గాలలో కీలక నేతలు ఎవరూ ముందుకు రాకపోవడంతో బొడ్డు అయోమయంలో పడ్డారు.