తిరుపతి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తమ వాహనాలకు వ్యక్తుల విగ్రహాలు, ఫొటోలు, రాజకీయ పార్టీల జెండాలు, చిహ్నాలు, అన్యమత ప్రచారానికి సంబంధించిన ప్రచార సామగ్రి తిరుమలకు తీసుకువెళ్లడాన్ని టీటీడీ కొన్ని దశాబ్దాల క్రితమే నిషేధించింది. మహారాష్ట్రీయులకు గర్వకారణమైన ఛత్రపతి శివాజీ మహరాజ్ను టీటీడీ అవమానించినట్లు సోషల్ మీడియాలో ఒక భక్తుడు ఇటీవల ప్రచారం చేశాడు. అది వాస్తవం కాదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు. అయితే అసలు ఏంజరిగిందనే దానిపై ఆయన వివరణ ఇచ్చారు.
ఇటీవల మహారాష్ట్రకు చెందిన వాహనాన్ని అలిపిరి చెక్పాయింట్ వద్ద భద్రతా సిబ్బంది నిలిపి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భద్రతా సిబ్బంది నల్లటి రంగులో ఉన్న ఒక ప్రతిమను గుర్తించారు. ఆ ప్రతిమ ఛత్రపతి శివాజీదని తెలుసుకుని తిరుమలకు అనుమతించారు. దేవతామూర్తుల చిత్రాలు తప్ప, వ్యక్తుల విగ్రహాలు, రాజకీయ పార్టీల జెండాలు, ఇతర చిహ్నాలను ప్రదర్శించరాదని సదరు భక్తుడిని కోరారు. అనంతరం ఆ భక్తుడికి వేంకటేశ్వరస్వామి దర్శనం చేయించి పంపారు. అయిదే ఆ తరువాత ఆ భక్తుడు శివాజీ మహారాజ్ను టీటీడీ అవమానించిందని ఆరోపిస్తూ తీవ్ర పదజాలంతో వీడియో రూపొందించి, ఇతరులను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో వైరల్ చేశారని ఆయన వాపోయారు. సోషల్ మీడియాలో ఉన్న వీడియోలోని విషయాలు పూర్తి అవాస్తవాలని సుబ్బారెడ్డి చెప్పారు.