‘‘అసలు జమ్ముకశ్మీర్ అంశం భారత్- పాక్ల మధ్య వివాదమే కాదు.. వివాదం ఉన్నది పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) తోనే. పాక్ ఆధీనంలో ఉన్న కశ్మీర్ భాగాన్ని తిరిగి సొంతం చేసుకోవడమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం.’’ చాలాకాలంగా బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ వాదన ఇది. ఆ సంస్థ దీర్ఘకాలిక లక్ష్యాల్లో ఇదీ ఒకటి. ఇప్పుడు ఆ లక్ష్య సాధన కోసం కార్యాచరణ ప్రణాళికను మోదీ ప్రభుత్వం అమలు చేయబోతోందా..? తాజా పరిణామాలు చూస్తే ఇందులో వాస్తవాన్ని తోసిపుచ్చలేమని చెపుతున్నారు రాజకీయ నిపుణులు. పీవోకే ప్రజలకు పూర్తి న్యాయం జరగాలంటే దానిని భారత్ స్వాధీనం చేసుకోవడమే మార్గమని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే తాజాగా జమ్ముకశ్మీర్లో జరిగిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. 1947 నుంచి కశ్మీర్లోయలో పాక్ అరాచకాలు కొనసాగుతున్నాయని, పాక్ దుర్మార్గాల వల్ల కశ్మీర్ ప్రజలు అనేక ప్రాంతాలకు పారిపోవాల్సి వచ్చిందన్నారు. తమ స్వేచ్ఛ, స్వాతంత్య్రాల కోసం పీవోకే ప్రజలు భారత్వైపు చూస్తున్నారని దత్తాత్రేయ అన్నారు.
‘పీవోకే ఖచ్చితంగా భారత్లో అంతర్భాగమే’
కాగా ఇదే సమయంలో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ మాట్లాడుతూ దాయాది దేశంతో మళ్లీ యుద్ధమంటూ జరిగితే పీవోకే ఇండియాలో అంతర్భాగం కావడం ఖాయమని, ఎందుకంటే అది భారత్కే చెందుతుందని తేల్చి చెప్పారు. కుట్రలను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం భారత్కు ఉందని రక్షణమంత్రి అన్నారు. ఏకకాలంలో వీరిద్దరూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు స్వదేశంలోను, అటు పాకిస్తాన్లోనూ కూడా ప్రకంపనలు రేపుతున్నాయి. పీవోకే విషయంలో మోదీ ప్రభుత్వం ఇకపై దూకుడుగా వ్యవహరించబోతుందనడానికి ఇది సంకేతమన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. వాస్తవానికి దశాబ్దాలుగా పాక్ సైన్యం, ఐఎస్ఐల కుట్రలను, శత్రుదేశ ప్రేరేపిత ఉగ్రచర్యలను అడ్డుకోవడం పైనే భారత్ ప్రధానంగా దృష్టి సారిస్తూ వచ్చింది. దాంతో భారత్ మెతక దేశమనే ముద్ర పడింది.
మోదీ హయాంలో పెరిగిన దూకుడు
అయితే మోదీ ప్రభుత్వ హయాంలో భారత్ సైన్యం దూకుడు పెంచింది. మనదేశంపై దుస్సాహసానికి పాల్పడితే ఎలా ఉంటుందో తెలిసివచ్చేలా పాక్ సైన్యం దిమ్మెరపోయేలా ఎదురుదాడులు చేస్తోంది. 2016 సెప్టెంబర్ 18న యూరి సెక్టార్ లోని భారత సైనిక స్థావరంపై నలుగురు జైషే మొహమ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు తుపాకులు, బాంబులతో దాడి చేసి 19 మంది భారత సైనికులను పొట్టన పెట్టుకున్నారు. ఆ సంఘటన తరువాత పాక్ ఊహకు అందనివిధంగా భారత యుద్ద విమానాలు సరిహద్దులు దాటి పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించి పలువురిని మట్టుబెట్టి విజయవంతంగా తిరిగివచ్చాయి. నాటినుంచి దేశంలోకి ఉగ్రవాదుల చొరబాటు, వారి కార్యకలాపాలు గతంతో పోల్చినపుడు బాగా తగ్గాయనే చెప్పాలి.
ఆర్థిక, రాజకీయ సంక్షోభాలతో బలహీనమైన పాకిస్థాన్
ఇక పాకిస్తాన్ ప్రస్తుతం ఆర్థికంగా గతంలో ఎన్నడూ లేనంత బలహీనంగా ఉంది. చైనాతోపాటు, ఇస్లామిక్ దేశాలు చేస్తున్న ఆర్థిక సాయంతో నెట్టుకొస్తోంది. అక్కడ శ్రీలంక తరహా సంక్షోభం వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేమన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో భారత్తో యుద్ధానికి తలపడటం ఆ దేశానికి తలకుమించిన పనే. ఈ కారణంగా ఇదే పీవోకే స్వాధీనానికి సరైన సమయమని మోదీ ప్రభుత్వం భావిస్తుండవచ్చని రాజకీయ నిపుణులు అంటున్నారు.
పీవోకే స్వాధీనం సాధ్యమేనా…?
పాక్ ఆక్రమిత కశ్మీర్ భాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం భారత్కు అంత తేలికగా సాధ్యమయ్యే విషయం కాదని, దీనికి పలు అంశాలను దృష్టిలో పెట్టుకుని అడుగులు వేయాల్సి ఉంటుందని మరికొందరు విశ్లేషకులు చెపుతున్నారు. పాక్ అణ్వస్త్రదేశం. నిజానికి భారత్కంటే పాకిస్తాన్ వద్దే ఎక్కువ అణ్వాయుధాలున్నాయి. యుద్ధమే జరిగితే రెండువైపులా భారీ నష్టం జరగడం ఖాయం. ఇక పాక్కు చైనా సైనికంగా అండదండలందిస్తోంది. చైనా భారీ వ్యయంతో నిర్మిస్తున్న చైనా- పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పీవోకే నుంచే వెళుతోంది. ఇందులో భాగంగా సీపోర్ట్ను, రైల్వే లైన్లను, రోడ్లను చైనా నిర్మిస్తోంది. ఈ కారణంగా భారత్ పీవోకే స్వాధీనం చేసుకునేందుకు చైనా సుతరామూ అంగీకరించదు. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వం పాక్ను హెచ్చరించి, నియంత్రించేందుకే ఈ వ్యాఖ్యలు చేస్తుండవచ్చని, వచ్చే సార్వత్రిక ఎన్నికలనాటికి ప్రజల్లో తమ ప్రభుత్వ ప్రతిష్ఠ పెంచుకునే లక్ష్యమూ వీటివెనుక ఉండవచ్చన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.