ఉభయ తెలుగు రాష్ట్రాలలో పేరొందిన స్వామి పరిపూర్ణానంద రాజకీయాలలో క్రియాశీలకం కావాలని ఉవ్వుళ్లూరుతున్నారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తరపున విస్తృత ప్రచారం చేసినా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయిన పరిపూర్ణానంద మరోసారి ఆంధ్రప్రదేశ్ లో తన ప్రతాపం చూపాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
2024 సార్వత్రిక ఎన్నికలలో ‘హిందూపురం’ పార్లమెంట్ నుంచి బీజేపీ తరపున పోటీ చేయాలని స్వామి తెగ ఉబలాటపడ్డారు. అయితే ఆ పార్టీ అధిష్టానం పరిపూర్ణానంద విజ్ఞప్తిని తోసిపుచ్చింది. కనీసం అసెంబ్లీ టికెట్ అయినా తనకు కేటాయించాలని స్వామి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో చివరకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగాలని స్వామీజీ నిర్ణయించుకున్నారు.
పరువు నిలబడుతుందా? పరిపూర్ణానంద చేస్తున్న ప్రయత్నంలో అయన పరువు నిలుస్తుందా? డిపాజిట్లు కోల్పోయి మరోమారు చతికిలబడే పరిస్థితి ఉంటుందా? అనే అంశంపై రాజకీయ వర్గాలలో విస్తృత చర్చ సాగుతోంది. 2019లో రాజమండ్రి పార్లమెంట్ స్తానం నుంచి ఇస్కాన్ నుంచి బయటకు వచ్చి పోటీ చేసిన సత్య గోపీనాధ్ దాస్ పరిస్థితి పరిపూర్ణానంద కు వస్తుందా? అనేదానిపై కూడా బీజేపీ వర్గాలలో చర్చ నడుస్తోంది. 2019కి ముందు సత్య గోపీనాధ్ దాస్ ఇస్కాన్ రాజమండ్రి శాఖ అధ్యక్షుడుగా, జాతీయ ఇస్కాన్ టెంపుల్స్ లో కీలక0గా వ్యవహరించారు. 2019 ఎన్నికలో 12,334 ఓట్లు సాధించిన గోపీనాధ్ దాస్ మొత్తం పోలైన ఓట్లలో ఒక శాతం లోపే ఓట్లు తెచ్చుకున్నారు. అంతే.. ఆ తర్వాత గోపీనాద్ దాస్ రాజకీయంగానూ, ఆధ్యాత్మికంగాను కనుమరుగైపోయారు. పరిపూర్ణానంద కూడా బీజేపీని కాదని స్వతంత్రంగా పోటీకి దిగితే అదే పరిస్థితి పునరావృతం అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే పరిపూర్ణానంద మాత్రం చివరి నిమిషంలో స్వతంత్రంగా బరిలోకి దిగడాన్ని విరమించుకు0తారని కూడా కొందరు బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.