ఏపీలో తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేలు నలుగురు టీడీపీ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ చేసి గెలిపించడం వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధిష్ఠానం టీడీపీకి ఓటు వేశారనే అనుమానంతో తమపార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలపై శుక్రవారం బహిష్కరణ వేటు వేసింది.
అయితే ముందే పార్టీపై తిరుగుబాటు ప్రకటించిన ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధరరెడ్డి మాత్రమే కాకుండా తాజాగా ఆ లిస్టులో చేరిన మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి కూడా తమను పార్టీ సస్పెండ్ చేయడాన్ని చాలా తేలిగ్గా తీసుకోవడాన్నిబట్టి వారు ఇప్పటికే భవిష్యత్తు రాజకీయ వ్యూహాలను సిద్దం చేసుకున్నట్టు కనిపిస్తోంది.తనను సస్పెండ్ చేస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని నెల్లూరు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి ప్రకటించారు. సస్పెండ్ చేయడం వల్ల చాలా సంతోషంగా ఉందన్నారు. ‘పార్టీ నిర్ణయంతో చాలా రిలాక్స్డ్గా ఉన్నాను. ముఖ్యమంత్రి జగన్కు మద్దతు ప్రకటించి, ఇన్నాళ్లు ఆయన వెంట నడిచినందుకు ఘనంగా సత్కరించారు’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇక ఉండవల్లి శ్రీదేవి తాను వైసీపీ అభ్యర్థికే ఓటు వేశానని అయినా కావాలనే తనపై పార్టీలోని ప్రత్యర్థులు దుష్ప్రచారం చేస్తున్నారని చెపుతూవచ్చారు.
నిర్ధారించుకున్నాకే సస్పెన్షన్
అయితే ఓటింగ్లో పార్టీ అభ్యర్థులకు కోడ్ విధానాన్ని అమలు చేశామని, అందులో పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసినవారిని గుర్తించి వారిపైన చర్యలు తీసుకుంటామని అంతకుముందు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. దానికి అనుగుణంగానే ఆ తర్వాత నలుగురిపై వేటువేస్తున్నట్టు వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ ప్రలోభాలకు వారు లొంగిపోయారని సజ్జల ఈ సందర్భంగా ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ది ఓటమి పాలవడాన్ని సీఎం జగన్ సీరియస్ గా తీసుకోవడమే పార్టీ సత్వర చర్యలకు కారణమని తెలుస్తోంది
ఎమ్మెల్మే కార్యాలయంపై దాడులు..
ఇదిలా ఉండగా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లు చించివేసి శ్రీదేవికి వ్యతిరేకంగా నినాదాలు కార్యకర్తలు, నినాదాలు చేశారు. అయితే ఈ దాడిపైన, తనను పార్టీనుంచి సస్పెండ్ చేయడం పైన ఆమె నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు.
పార్టీలో కలవరానికి సంకేతమా..
పార్టీ ఆవిర్భవించాక తొలిసారి అధికారంలోకి వచ్చిన వైసీపీకి అసెంబ్లీలో తిరుగులేని బలం ఉన్న విషయం తెలిసిందే. అందుకే ఇప్పటిదాకా సర్వేల పేరుతో వచ్చే ఎన్నికల్లో పార్టీటికెట్ వచ్చే అవకాశం లేదని తెలిసిన కొందరు నేతల్లో అసంతృప్తి సెగలు ఉన్నా ఎవరూ బయటపడే సాహసం చేయలేదు. ఎట్టకేలకు నెల్లూరు జిల్లాలో ప్రముఖ నేతగా ఉన్న మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తొలిసారిగా అసమ్మతి గళం వినిపించగా.. అదే జిల్లా నుంచి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, తాజాగా మేకపాటి చంద్రశేఖర్రెడ్డి ఇదే బాట పట్టారు. వీరు ముగ్గురూ ఆ పార్టీలో బలమైన నాయకులే కావడం విశేషం. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడం, ప్రజా వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతున్నట్టు అంతర్గత సర్వేలు సైతం చెపుతున్న సమయంలో పార్టీ కఠినవైఖరి తీసుకోకుంటే మరింతమంది అసమ్మతివాదులు తయారయ్యే అవకాశం ఉందని భావించడంతోనే ఎమ్మెల్యేలపై బహిష్కరణ వేటు పడినట్టు తెలుస్తోంది.