ఆంబర్ గ్రీస్ అంతవిలువైనదా? అసలు అది ఏంటి? పోలీసులు ఎందుకు స్వాధీనం చేసుకున్నారు? అవి తెలుసుకోవాలంటే ఉత్తరప్రదేశ్ లో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి గురించి తెలుసుకోవాల్సిందే.. ఆంబర్ గ్రీస్ కలిగిఉన్నారని తెలుసుకుని వారు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నలుగురు సభ్యులున్న ముఠాను అరెస్టు చేశారు. ఆంబర్ గ్రీస్ అంటే (తిమింగలం చేసుకున్న వాంతి). ఉత్తరప్రదేశ్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు 4.12 కిలోల ఈ ఆంబర్ గ్రీస్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే మార్కెట్లో దీని ఖరీదు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఎంతో తెలుసా.. సుమారు రూ.10 కోట్లు. ఆంబర్ కలిగి ఉన్నారన్న పక్కా సమాచారంతో ఉత్తరప్రదేశ్ పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (యూపీఎస్టీఎఫ్) లక్నోలోని గోమతీనగర్ ప్రాంతంలో దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో నలుగురు సభ్యులున్న ఒక ముఠాను అదుపులోకి తీసుకున్నారు.
ఇంతకీ ఈ ఆంబర్ కు ఎందుకు అంత విలువ అంటే దానికి ఎన్నో ఔషధగుణాలుంటాయట. ఎంతో సువాసన, ప్రత్యేక గుణాలు కలిగిన తిమింగలం వాంతిని సుగంధ పరిమళ ద్రవ్యాలు, కాస్మెటిక్స్, ఔషధాల తయారీలో వినియోగిస్తారు. ఈ ఆంబర్ తిమింగలాల జీర్ణవ్యవస్థ నుంచి నోటి ద్వారా వెలుపలికి విసర్జితమయ్యే ఓ పదార్థం. ఇది తిమింగలం పేగుల్లో ఉత్పత్తి అవుతంది. దానితో తయారైన పెర్ఫ్యూమ్ లు అత్యంత ఖరీదైనవిగా చలామణీలో ఉన్నాయి. అయితే ఆంబర్ కలిగి ఉంటే ఎందుకు దాడులు చేస్తారు? అనే ప్రశ్న రావచ్చు. ఎందుకంటే.. వైల్డ్ లైఫ్ (ప్రొటెక్షన్) యాక్ట్ 1972 ప్రకారం తిమింగలం వాంతి అమ్మకాలపై నిషేధం ఉంది. తిమింగలాల్లో ముఖ్యంగా స్పెర్మ్ వేల్ రకం తిమింగలాల నోటి నుంచి వచ్చే మైనం వంటి చిక్కని పదార్థాన్ని ఆంబర్ గ్రీస్ లేక గ్రే ఆంబర్, లేక నీటిపై తేలే బంగారం అని పిలుస్తుంటారు. సహజసిద్ధంగా లభించే ఈ పదార్థం అరుదైనది, అత్యంత విశిష్టమైనది. అందుకే అంత భారీ ధర పలుకుతోంది. గత జులైలో కేరళ మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లగా రూ.28 కోట్ల విలువైన ఆంబర్ గ్రీస్ వారి కంటపడింది. అయితే వారు దాన్ని వారు అధికారులకు అప్పగించారు.