రాష్ట్రంలోని సర్కారుపై ప్రజల అసంతృప్తి
అప్పుల్లో మునిగిన ఏపీ
కేంద్ర నిధులు మాయం..
మాఫియాలతో అవినీతి మయం
బీజేపీ వస్తేనే పోలవరానికి విముక్తి
రాజధాని అమరావతే..
కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ రాకతో ఆంధ్రప్రదేశ్ బీజేపీ క్యాడర్ లో ఉత్సాహం రెట్టింపైంది. ఆయన నూతనోత్సాహం నింపారు. ఏపీలో ఆయన అడుగుపెట్టడంతో జనం నీరాజనాలు పట్టారు. మొదట విశాఖలో ప్రముఖలతో సమావేశమయ్యారు. నగరంలోని పార్టీ పరిస్థితి, పలు అభివృద్ధి పనుల గురించి చర్చించారు. ప్రజల్లో బీజేపికి ఉన్న అభిమానం గురించి కార్యకర్తలు, ముఖ్యనేతలకు వివరించారు.
అలాగే విజయవాడలో కోర్ కమిటీ భేటీలో పాల్గొన్నారు. అనంతరం ఏలూరులో పోలింగ్ బూత్ ఏజెంట్లతో నిర్వహించిన సభలోను మాట్లాడారు. ఏలూరు సభకు అధిక సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. రాష్ట్రంలో మొదటి సారి,కేంద్రంలో మరోసారి మోదీ అంటూ నినాదాలు చేశారు.
రక్షణ మంత్రి రాజ్ నాథ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అనేక అంశాల గురించి క్లారిటీ ఇచ్చారు. ఏపీలో అరాచకాలు అధికమయ్యాయని, వాటిని బీజేపీ నేతలు, కార్యకర్తలు గట్టిగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలపై సాగించే ఉద్యమాలు, ఆందోళనల వల్లే పార్టీ ప్రజల్లోకి బలంగా వెళుతుందని చెప్పారు. బీజేపీ కార్యకర్త ప్రతి ఇంటికీ వెళ్లి కేంద్ర సంక్షేమ పథకాల గురించి వివరించాలని సూచించారు.
అలాగే ఒకరి ప్రశ్నకు సమాధానం చెబుతూ ఏపీ రాజధాని అమరావతే అని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధిపై చిత్తశుద్ధిలేదని ధ్వజమెత్తారు. కేంద్రం ఇస్తున్న నిధులు ఏమవుతున్నాయో తెలియడంలేదని వాపోయారు. రాష్ర్టం లిక్కర్, మైనింగ్ మాఫియాగా మారిపోయిందని ఆరోపించారు.
రాష్ట్రంలో ఏర్పడబోయేది బీజేపీ ప్రభుత్వమే అని గట్టిగా చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్, విశాఖ-చెన్నై ఆర్థిక కారిడార్, అమరావతి-బెంగళూరు హైవే వంటి వాటివి పూర్తి అవ్వాలంటే మన ప్రభుత్వమే రావాలన్నారు. రాష్ట్రంలో ప్రజావ్యతిరేక ప్రభుత్వం ఉందని, ప్రజల్లో వైసీపీపై తీవ్ర అసంతృప్తి ఉందని చెప్పారు. రెండు సార్లు అధికారంలోకి వచ్చాం. మూడోసారి 370 నుంచి 400 వరకు బీజేపీకి స్థానాలు వస్తాయని విశ్లేషకులు చెబుతున్నారని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు.
ఆయన ప్రసంగం రాష్ట్రంలోని ముఖ్యనేతల నుంచి కార్యకర్తల వరకు ధైర్యాన్ని నింపింది. నూతనోత్సాహం కనిపించింది.