జనసేన పార్టీ.. 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమౌతున్న విషయం తెలిసిందే. ఈ నెల 14వ తేదీన మచిలీపట్నంలో ఈ సభను భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ సభకు వారాహి వాహనంలో వేదిక వద్దకు చేరుకోనున్నారు. సభా వేదికకు పొట్టి శ్రీరాములు పేరును పెట్టారు. ఆవిర్భావ సభ పోస్టర్ కూడా ఇప్పటికే ఆవిష్కరించారు. ఈ ఆవిర్భావ సభకు సన్నాహకంగా జనసేన పార్టీ- పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇప్పటికే బీసీ నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ ఇందులో పాల్గొన్నారు. ఆవిర్భావ సభ కోసం ఏపీకి చేరుకున్న పవన్ కల్యాణ్ ఆదివారం కాపు సంక్షేమసేన ప్రతినిధులతో సమావేశమయ్యారు. కాపు నాయకుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య సహా పలువురు నాయకులు దీనికి హాజరయ్యారు. ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీ అజెండా కోసం తాము ఎప్పుడూ పని చేయబోమని స్పష్టం చేశారు. స్వతంత్ర భావాలు గల పార్టీగా జనసేన రాజకీయ కార్యకలాపాలు సుదీర్ఘకాలం పాటు కొనసాగుతాయని తేల్చి చెప్పారు.
ధనబలంతో కాదు.. భావనా బలంతో జనసేన నడుస్తుంది..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు వెయ్యికోట్ల రూపాయల ప్యాకేజీని ఆఫర్ చేశారంటూ ఇదివరకు వచ్చిన వార్తలపై పవన్ కల్యాణ్ తొలిసారిగా 1,000 కోట్ల రూపాయలను తీసుకుని రాజకీయాలు చేయొచ్చంటే.. అంతకంటే హాస్యాస్పదం మరొకటి ఉండదని జనసేనాని అన్నారు. వెయ్యి కోట్లు కాదు.. పదివేల కోట్ల రూపాయలు ఇచ్చిన రాజకీయాలు చేయలేమని, పార్టీని నడపలేమని ఆయన వివరించారు. పార్టీని నడపడానికి కావాల్సింది భావనా బలం మాత్రమేనని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కాన్షీరాం లాంటి నాయకులు డబ్బులు లేకుండా పార్టీని భావనాబలంతో నడిపించారని గుర్తు చేశారు. వామపక్ష భావజాలం ఉన్న ఉద్యమకారులు కూడా డబ్బులు లేకుండా పార్టీని నడిపించారని పవన్ గుర్తు చేశారు.. తాను జనసేన భావనాబలాన్ని నమ్ముకున్నానని, డబ్బులు లేకుండా రాజకీయం చేయలానేదే తన ఉద్దేశమని పవన్ కల్యాణ్ చెప్పారు. ఓటమికి తాను భయపడే వ్యక్తినే కాదన్నారు. ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నా వెరవకుండా పార్టీని నడుపుతున్నానని వివరించారు. గాజువాక, భీమవరంలల్లో పోటీ చేయాలని తనను ఆహ్వానించారని, అయినా అక్కడ ఓడిపోయానని అన్నారు. ప్రతి కాపు కూడా తనకు ఓటు వేసి ఉంటే తాను ఓడిపోయే వాడిని కాదని అన్నారు.