‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా పశ్చిమగోదావరిజిల్లా భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ సభలో పాల్గొన్నవారిలో మా అన్న చిరంజీవి తప్ప మిగిలినవారంతా అద్భుతంగా నటించారు..’ అంటూ కొణిదెల నాగబాబు తాజాగా ట్వీట్ చేయడం ఆసక్తిని కలిగిస్తోంది. నాగబాబును కేవలం చిరంజీవి, పవన్కల్యాణ్ల సోదరుడిగా మాత్రమే చూడలేం. ఆయన జనసేనలో ప్రముఖ నేతగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆ పార్టీ తరపున నరసాపురం ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే.. ఆయన ప్రస్తుతం జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నారు.
ఇక భీమవరంలో జరిగిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు కేంద్రమంత్రి కిషన్రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్కల్యాణ్ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో సభలో పాల్గొన్న నేతలు గొప్పగా నటించారని నాగబాబు ట్విటర్ వేదికగా వ్యాఖ్యానించడం ఎవరిని ఉద్దేశించి అయి ఉంటుందన్న చర్చ జరుగుతోంది.
పవన్కల్యాణ్కు సరైన పద్ధతిలో ఆహ్వానం అందకపోవడం, సభలో మిత్రపక్షమైనజనసేన నేతలకు ఎటువంటి ప్రాధాన్యం లేకపోవడంతో తమ పార్టీ క్యాడర్లో నెలకొన్న అసంతృప్తి, అసహనం వ్యక్తం చేసేందుకే నాగబాబు ఈ వ్యాఖ్యలు చేసినట్టు కనిపిస్తోంది. అయితే సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్న సభపై ఈ రకమైన వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ నాయకులు ఏవిధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.అంతేకాదు.. జనసేన- బీజేపీల మధ్య దూరం పెరుగుతున్న సంకేతాలనిస్తోందన్న అభిప్రాయానికి నాగబాబు వ్యాఖ్యలు తావిస్తున్నాయి.