పాలనాపరంగానైనా, రాజకీయంగానైనా ప్రతి అంశంలోనూ పదునైన పక్కా వ్యూహంతో ముందుకుసాగడం ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి ద్వయం అనుసరించే శైలి. తాజాగా దక్షిణాది నుంచి నలుగురు రాజకీయేతర ప్రముఖులను రాష్ట్రపతి కోటాలో కేంద్రం రాజ్యసభకు నామినేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖ సినీ రచయిత విజయేంద్రప్రసాద్, తమిళనాడు నుంచి దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా, కర్ణాటక నుంచి ప్రముఖ సామాజిక సేవకుడు వీరేంద్ర హెగ్డే, కేరళ నుంచి పరుగుల రాణిగా గతంలో దేశానికి పతకాలందించిన పీటీ ఉషకు ఈ అవకాశం దక్కింది. వీరిని రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్టు ప్రకటిస్తూ వారిని స్వయంగా ప్రధాని మోదీ అభినందిస్తూ ట్వీట్ చేయడం విశేషం. వీరందరూ తమ తమ రంగాల్లో విస్త్రృత స్థాయిలో సేవలందించినవారే. వీరు పెద్దల సభలో పెట్టనుండటం అందరూ హర్షించాల్సిందే. ఈ నిర్ణయానికి ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు ఆపాదించలేం.
అయితే ఇదే సమయంలో కేంద్ర మంత్రి పదవికి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా చేయడం.. ఆయన ఉప రాష్ట్రపతి పదవికి పోటీ చేయనున్నారని, అందుకే మంత్రి పదవి వదులుకున్నారని ఢిల్లీ రాజకీయవర్గాల్లోను, మీడియాలోనూ చర్చ నడుస్తుండటం గమనార్హం. గతంలో రాష్ట్రపతి పదవి ఉత్తరాదివారికి దక్కితే ఉపరాష్ట్రపతి పదవి దక్షిణాదివారికి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అన్ని అర్హతలున్నప్పటికీ, ఎన్డీయే మిత్రపక్షం కాకపోయినా తాము ఆయనకు మద్దతు ఇస్తామని తమిళనాడు సీఎం స్పష్టంగా చెప్పినప్పటికీ వెంకయ్యనాయుడిని రాష్ట్రపతి పదవికి పోటీలో నిలిపేందుకు బీజేపీ అధినాయకత్వం సుముఖత చూపలేదు. ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవిని సైతం ఇవ్వకుండా దక్షిణాదిని నిర్లక్ష్యం చేస్తున్నారన్న అపవాదునుంచి కొంతమేరకైనా బయటపడేందుకే వీరిని రాజ్యసభకు పంపుతోందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాదిన కూడా కాషాయ జెండా ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ ఈ రాష్ట్రాలకు అధికారంలోనూ, నిధుల కేటాయింపులోనూ తగిన ప్రాధాన్యం ఇస్తేనే ఇక్కడ బలం పుంజుకునే అవకాశం ఉంటుందన్న విశ్లేషణలూ వ్యక్తమవుతున్నాయి.