” సొంతంగా గెలిచే అంత బలంగా పుంజుకోకపోయినా.. వేరే పార్టీ గెలుపులో మాత్రం కీలకం కానుంది జనసేన. ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై అత్యంత ప్రభావవంతమైన దిశగా పవన్ కల్యాణ్ దూసుకుపోతున్నారు. ఈ నెల 14 న మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ సభలో టీడీపీ-బీజేపీ పొత్తులపై పవన్ క్లారిటీ ఇవ్వనున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.. ..”
జనసేన పార్టీ స్థాపించి పదేళ్లవుతున్న సందర్భంగా మచిలీపట్నంలో ఆవిర్భావ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలకు మరో ఏడాది మిగిలి ఉండటంతో.. ఈ సభను పవన్ అత్యంత ప్రతిష్ట్మాత్మకంగా తీసుకున్నారు. 36 ఎకరాల సువిశాల ప్రాంగణంలో సభను ఏర్పాటుచేయనున్నారు. రెండు రోజులు ముందుగానే పవన్ అమరాతి చేరుకోనున్నారు. పార్టీ నేతలతో కీలక మంతనాలు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో జనసేన బలం ఏంటి? బలహీనతలు ఏంటి? ఏ నియోజకవర్గాల్లో పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉంది? ఎక్కడ పికప్ చేసుకోవాలి? అన్న అంశాలపై స్టడీ చేయనున్నారు. రాజకీయంగా చేయవలసిన ప్రకటనలు, ఏ నిర్ణయాలు ప్రకటించాలో నేతల అభిప్రాయాలను తీసుకోనున్నారు. అందుకు అనుగుణంగా ఆవిర్భావ సభలో కీలక ప్రకటనలు చేయనున్నారు. డిసైడింగ్ ఫ్యాక్టర్ పార్టీగా జనసేన గుర్తింపు దక్కించుకుంది. ఆ పార్టీ కలిస్తే గెలుపు బాట పట్టవచ్చన్నది మిగతా పార్టీల అభిప్రాయం. అందుకే ఏపీలో రాజకీయాలు జనసేన చుట్టూ తిరుగుతున్నాయి. ఆ పార్టీతో జతకట్టే వారికి రాజకీయ అడ్వాంటేజ్ ఉంటుందన్న ప్రచారం ఉంది. అందుకే ఆ పార్టీ కోసం మిగతా రాజకీయ పక్షాలు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకే పవన్ తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. అయితే ప్రస్తుతం జనసేన అధికారికంగా బీజేపీకి మిత్రపక్షంగా ఉంది.
గత ఆవిర్భావ సభలో వైసీపీ అరాచకాలపై పవన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ పనితీరును మూడేళ్లు గమనించామని.. ఈసారి పోరాటం చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలిపోనివ్వకుండా కలిసొచ్చే రాజకీయ పార్టీలతో వెళతామని ప్రకటించారు. అప్పటి నుంచి పొత్తులపై ఒకరకమైన సానుకూల వాతావరణం ఏర్పడింది. టీడీపీ, జనసేనలు జత కడతాయని ప్రచారం సాగుతోంది. కానీ దీనిపై పవన్ ఎప్పుడు డైరెక్ట్ గా కామెంట్స్ చేయలేదు. కానీ ఈ ఆవిర్భావ సభలో మాత్రం పొత్తులపై క్లారిటీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు సరిగ్గా ఏడాది వ్యవధి ఉండడంతో ఇదే కరెక్ట్ టైమ్ గా భావిస్తున్నట్టు తెలుస్తోంది.