ఏపీ ఎన్నికలు సమీపిస్తుండడంతో పార్టీలు దూకుడు పెంచాయి. టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడిగా వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తుండగా, సీఎం జగన్ మాత్రం నా కల.. నా లక్ష్యం అంటూ సరికొత్త పంథాలో ముందుకు సాగుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా అదేస్థాయిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఫిక్స్ అయ్యింది. విశాఖ జిల్లా కాంగ్రెస్ నేతలు తమ తొలి ఎన్నికల సభకు సిద్ధమవుతున్నారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 16న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాంతంలోని కృష్ణా మైదానంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించనునున్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు నేతృత్వంలో ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేతలు మైదానాన్ని పరిశీలించారు. ఈ సమావేశానికి 70 వేల మంది హాజరవుతారని ఆశిస్తున్నామని, ఈ ప్రాంతానికి కీలకమైన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించడమే దీని ప్రధాన ఉద్దేశమని చెప్పారు. కార్మిక సంఘాలు, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ 1,000 రోజులకు పైగా తమ అసమ్మతిని వ్యక్తం చేస్తున్నాయి.