”రామచంద్రపురం వైసీపీ నుంచి మంత్రి వేణు పోటీ చేస్తే నేను వైసీపీకి రాజానామా చేసి పోటీకి దిగుతాను. లేకపోతె నా కుమారుడు ఇండిపెండింట్ గా పోటీ చేస్తాడు.. ఇందులో తగ్గేదిలేదు..” అని వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ తెగేసి చెప్పారు. అప్పటికే వేణుకి రామచంద్రపురం సీటు ప్రకటించిన వైసీపీ అధినేత జగన్.. బోస్ దెబ్బకు దిగి వచ్చారు. తన నిర్ణయాన్ని మార్చుకుంటానని బోస్ కి మాటిచ్చారు. దీంతో బోస్ వెనక్కి తగ్గారు. రామచంద్రాపురంలో సర్వే చేయించి గెలుపు అవకాశాలు ఉన్న వాళ్ళకే టికెట్ ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు.
బోస్ బలమేంటి? మంత్రి వేణుగోపాల్ కృష్ణ అవినీతిపై ఎంపీ బోస్ వర్గీయులు కొన్ని ఆధారాలను సేకరించినట్లు చెపుతున్నారు. వీటిని బయటపెట్టడానికి సిద్దమవుతున్నట్లు మిదున్ రెడ్డి దృష్టికి వెళ్లినట్లు తెలిసింది. ఈ విషయాన్ని జగన్ దృష్టికి తీసుకువెళ్లాడటంతో అలెర్ట్ అయిన జగన్… వెంటనే సమస్య పరిష్కరించాలని మిదున్ రెడ్డిని ఆదేశించినట్లు సమాచారం. దీంతో మిదున్ రెడ్డి… జగన్ హామీ ఇచ్చినట్లు బోస్ కి చెప్పి వైసీపీ వర్గ విభేదాలకు తాత్కాలికంగా చెక్ చెప్పారు. వేణుకి టికెట్ ఇవ్వకపోయినా తిరుగుబాటు చేసేంత స్థాయిలేకపోవడం కూడా వైసీపీకి కలసివచ్చే అంశంగా చెపుతున్నారు.