గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఈ నెల 17న నిర్వహించనున్న టీడీపీ-జనసేన బహిరంగ సభకు ఆర్టీసీ బస్సులు ఇవ్వకుంటే అధికారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆర్టీసీ ఎండీని టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ఏ పార్టీ సభలు పెట్టుకున్నా బస్సులు ఇచ్చేవారని, ఇప్పుడు మాత్రం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిలకలూరిపేట సభలో ‘సూపర్ సిక్స్’, ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తామని తెలిపారు.
తమకు అనుకూలంగా సోషల్ మీడియాలో పనిచేసే వారిపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. 10 లక్షల మందితో సభ నిర్వహిస్తున్నామని.. ఈ సభతో చరిత్ర సృష్టించబోతున్నట్టు తెలిపారు. టీడీపీ, జనసేన సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు బెదిరిస్తే వెంటనే 73062 99999కు ఫోన్ చేస్తే టీడీపీ వెంటనే స్పందిస్తుందని అచ్చెన్నాయుడు తెలిపారు.