ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారన్న కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వాలంటీర్లను అధికారులు సస్పండ్ చేస్తున్నారు. అయితే స్థానిక అధికార వైసీపీ నేతలు మాత్రం సదరు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కొందరు అధికారులు టెన్షన్ తో ఉన్నారు.
వాలంటీర్ల (Volunteers) తొలగింపు వ్యవహారం అధికారులకు తలనొప్పిగా మారుతోంది. చిత్తూరు జిల్లా (Chittoor Dist.)లో తాజాగా మరో ఇద్దరు వాలంటీర్లను జిల్లా యంత్రాంగం తొలగించింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 35 మంది వాలంటీర్లను తొలగించారు. చిత్తూరు కార్పొరేషన్లో 18 మంది, పలమనేరు మున్సిపాలిటీలో 12 మంది, గుడిపాల మండలంలో ముగ్గురు, పులిచెర్ల మండలంలో ఇద్దరు వాలంటీర్లను జిల్లా యంత్రాంగం తొలగించింది. అధికార పార్టీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై వాలంటీర్లు తొలగించారు. జిల్లా వ్యాప్తంగా 163 మంది వాలంటీర్లు ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో అధికార వైసీపీకి అనుకూలంగా పాల్గొంటున్నట్లు జిల్లా యంత్రాంగం గుర్తించినట్లు సమాచారం. డాక్టర్ బీఆర్ అంబెడ్కర్ కోనసీమ జిల్లాలోనూ పలువురు వాలంటీర్లను స్థానిక ఎంపీడీవో సస్పండ్ చేసారు. మరి కొంతమందిపై వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. ఫిర్యాదులు వస్తున్న వారిని ఉంచితే ప్రచారంలో జోరులో తగ్గని పరిస్థితి.. తొలగిస్తే నేరుగానే ప్రచారం చేస్తారు.. ఇది ప్రమాదకరంగా మారుతోందని జిల్లా యంత్రాంగం తలలు పట్టుకుంటోంది. తొలగించిన వాలంటీర్లు వైసీపీ అధికారంలోకి వస్తే.. మళ్లీ వాలంటీర్లుగా నియమింపబడతారు అన్న ధీమా వారిలో నెలకొంది.