ఏపీలో కొందరు అఖిల భారత సర్వీసుల అధికారులు సీఎం జగన్ కు బానిసలుగా మారిపోతున్నారు. ఈ పరిణామం పెను ప్రమాదకరం…
‘ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు కావాలంటే’ అంటూ తన వైసీపీ పార్టీ తరపున జగన్మోహన్ రెడ్డి 15 రోజుల కార్యక్రమాన్ని చేపట్టారు. 3 నెలల తర్వాత ఏపీలో ఎన్నికలు జరగనున్నందున తన నాయకత్వం గొప్పదనం గురించి చెప్పుకొని ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేయడం జగన్ తప్పేమీ కాదు. అయితే రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో ప్రభుత్వ యంత్రాంగాన్ని భాగస్వామిని చేయడమే అనైతికం. ‘జగనే ఎందుకు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా జిల్లా కలెక్టర్లతో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మరీ ముఖ్యమంత్రి కోరడం విడ్డూరంగా ఉంది. రాజకీయ కార్యక్రమాలకు ప్రభుత్వ యంత్రాంగం దూరంగా ఉండాలి. రూల్ ఆఫ్ లా అమలు చేయడానికి మాత్రమే ప్రభుత్వ యంత్రాంగం ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీ తరఫున ప్రచారం చేయడానికి ప్రభుత్వ సిబ్బందిని వినియోగించడం నేరం అవుతుంది. రాజకీయ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందిపై గతంలో చర్యలు తీసుకొనేవారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాజకీయ కార్యక్రమాలకు, ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య ఉండాల్సిన లక్ష్మణ రేఖ చెరిగిపోయింది. ‘జగనే ఎందుకు’ కార్యక్రమం వైసీపీ చేపట్టిన రాజకీయ ప్రోగ్రాం మాత్రమే. అలాంటప్పుడు ఆ కార్యక్రమంతో అధికారులకు ఏమి పని? ఈ ప్రశ్నకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి బాధ్యత వహించాలి. అఖిల భారత సర్వీసుకు చెందిన బ్యూరోక్రాట్లు ఇంతగా దిగజారిపోవడాన్ని ఇప్పుడే చూస్తున్నాం.