మొదటి టెస్టులో ఘోర ఓటమితో భారత జట్టు రెండో టెస్టు కోసం కోల్కతా వచ్చింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండో టెస్టు మొదలైంది. మొదట బ్యాటింగ్ చేసిన కంగారు జట్టు తన తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 455 పరుగులు చేసింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా కేవలం 171 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో ఫాలోలఅన్ ఆడించింది ఆస్ట్రేలియా. అలా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 115 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన లక్ష్మణ్.. ద్రావిడ్తో జతకట్టాడు. ఇద్దరూ కలిసి ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. తమదైన ఆటతో ఇద్దరూ క్రీజులో పాతుకుపోయారు.
కంగారు జట్టు బౌలర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఈ ద్వయాన్ని వీడదీయలేకపోయారు. ఇద్దరు కూడా భారీ సెంచరీలతో కదంతొక్కారు. ద్రావిడ్ 181 పరుగులు చేస్తే, లక్ష్మణ్ 281 పరుగులతో తన టెస్టు కెరీర్లోనే నిలిచిపోయే గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. ఇలా ఈ జోడీ 376 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఇక మ్యాచ్లో భారీ టార్గెట్ ఛేదనతో బరిలోకి దిగిన ప్రత్యర్థి జట్టును టర్బొనేటర్ హార్భజన్ సింగ్ ముప్పుతిప్పులు పెట్టాడు. ఏకంగా ఆరు వికెట్లు తీసి, జట్టును 171 పరుగుల తేడాతో గెలిపించాడు.