- 40 శాతం జనాభా చేతిలో ఉన్న సంపద 19.8 శాతమే
- 22% మంది భారతీయుల సంపాదన రోజుకు రూ.160
- ఐక్యరాజ్యసమితి వెల్లడి
- లింగ అభివృద్ధి సూచీలో ఆఫిక్రా దేశాల కంటే వెనుకబడిన భారత్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: ఆర్థికాభివృద్ధిలో భారత్ దూసుకుపోతున్నదని ఊదరగొట్టినా.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో బ్రిటన్ను వెనక్కు నెట్టామని జబ్బలు చరుచుకొన్నా.. దేశంలో ఇప్పటికీ ప్రజల కనీస అవసరాలైన తిండి, విద్య, వైద్యం అందరికీ అందుబాటులో లేవన్న పచ్చి నిజం బట్టబయలైంది. బీజేపీ పాలనలో సంపద కేంద్రీకరణ అసాధారణ స్థాయికి చేరిందని తేటతెల్లమైంది.
దేశంలోని మొత్తం సంపదలో 25 శాతం కేవలం ఒక శాతం కుబేరుల చేతుల్లోనే కేంద్రీకృతమైందని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) ఏటా ప్రచురించే మానవాభివృద్ధి నివేదిక (హెచ్డీఐ)లో తేలింది. గత 32 ఏండ్లలో తొలిసారి వరుసగా రెండు సంవత్సరాలు భారత్లో మానవాభివృద్ధి తిరోగమనంలోనే ఉన్నదని వెల్లడైంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మనం ఐదో స్థానంలో ఉన్నామని కేంద్ర ప్రభుత్వం గప్పాలు కొడుతున్నప్పటికీ మానవాభివృద్ధిలో పేద దేశాలకంటే వెనుకన ఏకంగా 132వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. హెచ్డీఐ రిపోర్టులోని 90 శాతం దేశాల్లో మానవాభివృద్ధి 2020 నాటి స్థాయికి పడిపోగా భారత్లో ఏకంగా 2016 నాటి స్థాయికి దిగజారింది.