విరాటపర్వం సినిమాపై వీహెచ్ పీ మండిపడుతోంది. కొన్ని అభ్యంతరాలు రేపుతోంది. సెన్సార్ బోర్డుపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తోంది. టాలీవుడ్ ప్రముఖ నటుడు రానా, ప్రముఖ హీరోయిన్ సాయి పల్లవి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన సినిమా విరాటపర్వం. రెండు రోజుల క్రితం విడుదలయింది. అయితే విరాటపర్వం సినిమాపై విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ)కి చెందిన అజయ్ రాజ్ హైదరాబాద్లోని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సినిమాకు అనుమతి ఇచ్చిన సెన్సార్ బోర్డుపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. నక్సలిజం, ఉగ్రవాదాలను ప్రేరేపించేలా విరాటపర్వం సినిమా ఉందని అజయ్ రాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి సినిమాలకు అనుమతులు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా యువతను పెడదారి పట్టించేలా ఉందని ఆరోపించారు.