మొన్నటిదాకా బాలీవుడ్ పరిశ్రమకు ఎదురులేదు. ఇప్పుడా పరిస్థితి లేదు. అయితే బాలీవుడ్ సినిమాలు వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్న సమయంలో వాటికి దీటుగా చిత్రాలను తెరకెక్కించే ప్రయత్నం కోలీవుడ్ దర్శక నిర్మాతలు చేశారు. శంకర్ వంటి దర్శకులు ఆ దిశగా మంచి పునాదినే వేశారు. అయినా బాలీవుడ్ పరిశ్రమ స్థాయి వేరే లెవెల్ అనే పరిస్థితే కొనసాగింది. ఆ తరువాత టాలీవుడ్ నుంచి రాజమౌళి చెక్కిన బాహుబలి మూవీ చేసిన మ్యాజిక్ తరువాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. వెండితెరపై దక్షిణాది ఆధిపత్యం మొదలైంది. ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్ నుంచి వస్తున్న సినిమాలు సృష్టిస్తున్న సంచలనాల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక ఈ ఏడాది ఇప్పటిదాకా బాలీవుడ్ వర్గాలకు పీడకలగా మారిందని చెప్పాలి. భారీ అంచనాలతో వచ్చిన పలు చిత్రాలు బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం పాలయ్యాయి.
ఇదే సమయంలో ఏకంగా సౌత్ నుంచి మూడు భాషల్లోనూ కొత్తగా ఇండస్ట్రీ రికార్డులు నమోదయ్యాయి. ఈ ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రం తెలుగు నాట ఆల్టైమ్ రికార్డు వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. గతంలో బాహుబలి-2 పేరిట ఉన్న రికార్డులను ఇది తిరగరాసింది. ఇక కన్నడ చిత్ర పరిశ్రమలోనూ ప్రశాంత్నీల్ దర్శకత్వంలో యశ్ కథానాయకుడిగా తెరకెక్కిన కేజీఎఫ్-2 చిత్రం ఆ పరిశ్రమలో కొత్త రికార్డులను లిఖించింది. ఈ రెండు చిత్రాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుని వెయ్యి కోట్ల రూపాయల క్లబ్లో చేరిన విషయం తెలిసిందే. కాగా విశ్వ నటుడు కమల్హాసన్ కథానాయకుడిగా చాలాకాలం తరువాత ఆయన స్థాయికి తగిన విజయాన్నిఅందించిన చిత్రం విక్రమ్. ఇటీవలే విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ మూవీ కోలీవుడ్లో పాత రికార్డులన్నీ తిరగరాసింది. గతంలో తమిళనాట కూడా అత్యధిక వసూళ్ల రికార్డు బాహుబలి-2 పేరున నమోదై ఉండగా ఇప్పుడు కమల్ మూవీ దానిని అధిగమించింది. దీనితో నెలల వ్యవధిలో సౌత్లోని మూడు ఇండస్ట్రీల్లోనూ కొత్త ఇండస్ట్రీ హిట్లు రావడం, అదీ కోవిడ్ పాండమిక్ తరువాత ప్రేక్షకులు ఈ స్థాయిలో ఆదరించడంపై దక్షిణాది చిత్ర పరిశ్రమ వర్గాలు ఆనందోత్సాహాలు వ్యక్తంచేస్తున్న పరిస్థితి ఉంది.