మానవాళి అంతానికి ఇంకా ఎంత దూరంలో ఉందో సూచించే డూమ్స్ డే క్లాక్ చరిత్రలోనే అర్ధరాత్రికి అత్యంత చేరువైంది. ఇప్పటివరకు అర్ధరాత్రికి 100 సెకండ్ల దూరంలో ఉండగా ఇప్పుడు దానిని 90 సెకండ్లకు తగ్గించినట్లు అటామిక్ సైంటిస్ట్స్ బులెటెన్ ప్రకటించింది. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అణుముప్పు పెరగడం, వాతావరణ సంక్షోభం వంటి కారణాల వల్ల డూమ్స్ డే క్లాక్ను అర్ధరాత్రికి చేరువ చేసినట్లు వెల్లడించింది. 11 మంది నోబెల్ అవార్డు గ్రహీతలతో కూడిన సైన్స్ అండ్ సెక్యూరిటీ బోర్డు సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
డూమ్స్ డే క్లాక్ అంటే
మానవాళి స్వీయ వినాశనానికి ఎంత దగ్గరగా ఉందో చెప్పే సూచికగా డూమ్స్ డే క్లాక్ను 1947లో ఏర్పాటు చేశారు. అణ్వాయుధాల ఉత్పత్తికి కారణమైన మన్హటన్ ప్రాజెక్ట్లో పనిచేసిన శాస్త్రవేత్తలు దీనిని ఏర్పాటు చేశారు. ఇందులో ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా ఉన్నారు. ఇది ఏర్పాటు చేసినప్పుడు అర్ధరాత్రికి 7 నిమిషాల దూరంలో పెట్టారు. శాస్త్రవేత్తల బృందం పరిస్థితులను బట్టి ముందుకు వెనక్కు మారుస్తున్నది. మానవాళి వినాశనానికి చేరువైందని భావిస్తే క్లాక్ను అర్ధరాత్రికి దగ్గర చేస్తారు. ముప్పు తగ్గిందని భావిస్తే అర్ధరాత్రికి దూరం చేస్తారు. 1991లో కోల్డ్ వార్ ముగిసిన తర్వాత అర్ధరాత్రికి 17 నిమిషాల దూరానికి మార్చారు. డూమ్స్ డే క్లాక్ చరిత్రలో అర్ధరాత్రికి పెట్టిన అత్యంత దూరం ఇది.