ఇప్పటి వరకు జరిగింది ట్రయల్ మాత్రమే.. అసలు యుద్ధం ముందుంది అంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ యుక్రెయిన్ అధ్యక్షుడిని హెచ్చరించారు. అంతే కాదు వీలైనంత త్వరగా తమ నిబంధనలను అంగీకరించాలని, లేనిపక్షంలో మరిన్ని తీవ్ర పరిణామాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరికలు జారీచేశారు. మాస్కో సేనలు ఇంకా తమ అసలైన యుద్ధం ప్రారంభించనే లేదన్నారు. ‘ఉక్రెయిన్ ప్రజలకు ఇది విషాదం లాంటిదే.. కానీ, ప్రస్తుత పరిణామాలు ఈ దిశగానే వెళ్తున్నట్లు కనిపిస్తోంద’ని పుతిన్ వ్యాఖ్యానించినట్లు ఓ వార్తాసంస్థ తెలిపింది. యుద్ధం ముగించడానికి చర్చలు జరిపేందుకు తాను సిద్ధమే అని ప్రకటించారు. కాని పశ్చిమ దేశాలు శత్రుత్వానికి ఆజ్యం పోస్తున్నాయిని ఆరోపించారు. ఈ ప్రక్రియ ఆలస్యమైతే.. తర్వాత ఒప్పందం చేసుకోవడం చాలా కష్టమవుతుందని పుతిన్ తీవ్రంగా హెచ్చరించారు.
యుక్రెయిన్పై ఫిబ్రవరి 24న రష్యా దాడులు మొదలుపెట్టింది. తాజాగా లుహాన్స్క్ పై పట్టు సాధించాయి. రెండు దేశాల మధ్య దాదాపు నాలుగున్నర నెలలుగా యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటికే లక్షలాది పౌరులు దేశాన్ని విడిచి వెళ్లారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో అత్యంత తీవ్రమైన మానవతా సంక్షోభం ఇదే నంటూ చాలా మంది మేధావులు పేర్కొంటున్నారు. మరోవైపు రష్యాను కట్టడి చేసేందుకు అమెరికా, బ్రిటన్తోసహా పశ్చిమ దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. కాని రష్యా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పైగా మరింత దూకుడుగా హెచ్చరిస్తోంది.