నైజీరియా రాజధాని అబూజలో ఉన్న ఓ జైలుపై తీవ్రవాదులు దాడిచేశారు. ఈ ఘటనలో దాదాపు 600 మంది ఖైదీలు పరారయ్యారు. అయితే వారిలో సుమారు 300 మందిని తిరిగి పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇస్లామిక్ మిలిటెంట్ వ్యతిరేక ముఠాలే ఈ దాడికి కారణమని నైజీరియా అధికారులు అనుమానిస్తున్నారు. మంగళవారం రాత్రి 10గంటల సమయంలో పక్కా ప్రణాళికతో వచ్చిన తీవ్రవాద ముఠాలు కుజీ జైలుపై పేలుడు పదార్థాలతో దాడికి తెగబడ్డారు. విధుల్లో ఉన్న భద్రతా సిబ్బందిని హతమార్చారు. పేలుడు పదార్థాలతో గోడలను కూల్చి లోనికి ప్రవేశించారు. బోకో హరమ్గా పిలిచే ఇస్లామిక్ మిలిటెంట్ వ్యతిరేక ముఠాలే ఈ దాడులకు పాల్పడినట్లు నైజీరియా అంతర్గత వ్యవహారాల శాఖ కార్యదర్శి శువాయిబ్ బెల్గోర్ పేర్కొన్నారు. ఆ గ్రూపునకు చెందిన వారు ఎక్కువ మంది ఖైదీలుగా ఉన్నారని.. వారిని విడిపించుకు వెళ్లేందుకే దుండగులు ఈ పథకం రచించారని తెలిపారు.