‘ప్రజాగ్రహానికి ఆ దేశాధ్యక్షుడు దేశం వదిలి పారిపోయాడు”
శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే భవనంలో రహస్య బంకర్ను నిరసనకారులు గుర్తించారు. ముట్టడి నేపథ్యంలో దాని ద్వారా ఆయన పారిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో ఆ దేశ ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటుకు దిగారు. అధ్యక్షుడు గోటబయ కార్యాలయం, నివాస భవనాన్ని లక్షలాది నిరసనకారులు ముట్టడించారు. దీంతో ఆయన అక్కడి నుంచి పారిపోయారు. గోటబయ దేశాన్ని విడిచి పరారైనట్లు స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
మరోవైపు నిరసనకారులు శనివారం నుంచి అధ్యక్ష భవనం అంతటా తిరుగుతున్నారు. అధ్యక్షుడి బెడ్పై కొందరు సేదతీరారు. పెద్ద కిచెన్లోని ఆహారాన్ని తినడంతోపాటు అక్కడున్న మద్యాన్ని కూడా సేవించారు. అధ్యక్షుడి స్విమ్మింగ్ పూల్లో కొందరు ఈత కొట్టారు. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాగా, అధ్యక్షుడి భవనంలోని అన్ని గదులను నిరసనకారులు పరిశీలిస్తున్నారు. దీంతో ఒక గదిలోని రహస్య బంకర్ను ఆదివారం గుర్తించారు. ఆ బంకర్లోకి వెళ్లే డోర్ గుర్తించని విధంగా ఉంది. అలాగే కేవలం లిఫ్ట్ ద్వారానే ఆ బంకర్లోకి ప్రవేశించే వీలుంది. అయితే బంకర్ చివరన బలమైన స్టీల్ డోర్ ఉంది. దీంతో నిరసనకారులు సైతం దానిని తెరిచేందుకు ప్రయత్నించలేదు.