మాల్దీవుల ప్రభుత్వం తాజాగా భారత్ ను మరోమారు రెచ్చగొట్టే చర్యకు పూనుకొంది. హిందూ మహా సముద్రంలోని తమ తీర జలాల్లో నిఘా నౌకను నిలిపేందుకు చైనాకు అనుమతిచ్చింది. సిబ్బంది రొటేషన్, ఇతర అవసరాలకోసమే ఈ నౌకకు ఆశ్రయం ఇస్తున్నామని.. మిత్ర దేశాలకు చెందిన వాహనాలను ఎల్లప్పుడూ స్వాగతిస్తామని వ్యాఖ్యానించింది. చైనా నుంచి బయల్దేరిన ఈ నౌక ఫిబ్రవరి 8న మాల్దీవులకు చేరుకోనుంది. ఇటీవల భారత ప్రధాని మోదీపై మాల్దీవులకు చెందిన ముగ్గురు మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అంతకుముదు ఆ దేశాధ్యక్షుడు ముయిజ్జు మాల్దీవుల నుంచి భారత సైన్యాన్ని వెళ్లిపోవాల్సిందిగా కోరారు. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఇప్పుడు ఏకంగా చైనాకు చెందిన నిఘా నౌక షియాన్ యాంగ్ హాంగ్-3ను మాల్దీవులు అనుమతించింది. భారత్లోని కొన్ని ప్రాంతాలు, నౌకాశ్రయాలు, గగనతలంపైనే కాక అణు ప్లాంట్లపైనా ఓ కన్నేసి ఉంచగల అధునాతన పరికరాలతో కూడిన ఇలాంటి నౌకను చైనా గత ఏడాది శ్రీలంక తీరంలో నిలిపేందుకు ప్రయత్నించగా భారత్ అభ్యంతర పెట్టింది. దీంతో అనుమతి లభించలేదు. కాగా, 2019లో భారత జలాల్లోకి చైనా నౌక అక్రమంగా ప్రవేశించగా.. దానిని భారత దళాలు వెనక్కుపంపాయి. షియాన్ యాంగ్ హాంగ్-3ను నిఘా నౌకగా చూడొద్దని భారత్ను చైనా కోరింది. అయితే ఇందులో మతలబును భారత్ నిఘా వర్గాలు పసిగట్టాయి.