ఇంగ్లండ్తో కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగిన తొలి వన్డేలో భారత్ తన స్థాయికి తగిన ఆట తీరుతో సత్తా చాటింది. పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత భారత బౌలర్లు చెలరేగడంతో ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ 25.2 ఓవర్లలో 110 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో జోస్ బట్లర్ చేసిన 30 పరుగులే అత్యధికం. భారత బౌలర్లలో బుమ్రా నిప్పులు చెరిగే బంతులు విసిరి 6 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. షమీ 3 వికెట్లు తీసుకున్నాడు. వారి ధాటికి ఏకంగా నలుగురు ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ ఖాతా తెరవకుండానే పెవిలియన్కు క్యూ కట్టారు. ఒక దశలో ఆ జట్టు 100 పరుగులకు చేరడం కూడా అసాధ్యమనిపించింది.
ఆ తరువాత 111 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఓపెనర్లలో రోహిత్ శర్మ ఆతిథ్య దేశ బౌలర్లపై విరుచుకుపడి 58 బంతుల్లోనే 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 76 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ శిఖర్ధావన్ అతడికి అండగా నిలిచి 31 పరుగులతో అజేయంగా నిలవడంతో భారత్ మూడు వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.