వరకట్నం అనేది భారత్ లో అతిపెద్ద సమస్య. అనాదిగా ఆచారంగా కొనసాగుతోంది. పెళ్లి జరగాలంటే వరకట్నం చేతులు మారాల్సిందే. దీనిలో డబ్బున్నోళ్లు.. లేనోళ్లనే తేడాలేదు. ఎవరిస్థాయిలో వారు ఈ కట్నాలు కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. క్యాస్ట్ ఏదయినా కట్నం తీసుకోవడంలో.. ఇవ్వడంలో తేడాలేమీ ఉండవు. ఈ ఆచారంతో కోట్ల మంది తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారి పాట్లు అన్నీ ఇన్నీ కాదు. ఆస్తులు అమ్ముకుంటారు, అప్పులు పాలవుతారు. ఎన్నో కుటుంబాలను వేధిస్తుంది ఈ సమస్య. వరకట్న సమస్యతో ఎందరో మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు కూడా. అందుకే వరకట్న నిషేధ చట్టం కూడా తెచ్చారు. అయినా అది ఆగలేదు. కారణం ఒక ఆచారంగా ముడిపడి ఉండడమే. అయితే ఝార్ఖండ్ లోని బర్వాదీ గ్రామంలోని ముస్లింలు ఆ ఆచారానికి చెక్ పెట్టారు. కట్నాన్ని నిషేధించుకున్నారు. దాన్ని పక్కాగా అమలుచేస్తున్నారు.
ఝార్ఖండ్ గిరిధ్లోని బర్వాదీ గ్రామస్థులు ఆదర్శమైన నిర్ణయం తీసుకున్నారు. కట్నం ఇవ్వడం, తీసుకోవడాన్ని నిషేధిస్తూ తీర్మానం ఆమోదించారు. బర్వాదీ అంజుమన్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కట్నం తీసుకోవద్దనే నిర్ణయాన్ని మొదట ముస్లింలే అమలులోకి తెచ్చారు. అంతే కాదు పక్కాగా అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 200కు పైగా వివాహాలు కట్నం లేకుండానే జరిపించారు. బర్వాదీ గ్రామ పంచాయతీలో రెండేళ్ల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ప్రారంభంలో ఈ విధానం అంత పక్కాగా అమలు కాలేదని.. కొంతమంది రహస్యంగా కట్నం తీసుకునేవారని బర్వాదీ అంజుమన్ కమిటీకి చెందిన సదర్ లాల్ మహ్మద్ అన్సారీ అన్నారు. అది తెలుకున్న తర్వాత దానిని అరికట్టారు. కట్నం తీసుకున్న కుటుంబాలను బహిష్కరించినట్లు వివరించారు. ఆ తర్వాత గ్రామస్థులంతా ఈ నిబంధనకు అలవాటుపడుతూ వచ్చారని అన్సారీ చెప్పారు. ప్రస్తుతం గ్రామంలోని ప్రజలంతా కట్నాన్ని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. వరకట్న నిషేధం పక్కాగా అమలవుతుండడాన్ని చూసిన ఇతర గ్రామస్థులు తమ గ్రామంలోనూ ఇలాంటి సంప్రదాయాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు. హిందువులు సైతం కట్నం లేకుండా వివాహాలు చేసుకోవడం మొదలుపెట్టారు.