ఆదివారం పిల్లలకు ఎంతో ఇష్టం. ఎందుకంటే.. వారంలో ఆరు రోజులూ చదువుల ఒత్తిడి నుంచి ఆదివారం కాస్త రిలీఫ్. అలాగే కాయ కష్టం చేసే వారు .కూడా కాస్త స్వేద తీరేది ఆదివారమే. స్కూల్కి వెళ్లే పిల్లలు, ఉద్యోగాలకు వెళ్లే వారు, యువత అందరికీ ఆదివారం సెలవే. ఆ రోజు ఎప్పుడొస్తుందా అని ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తారు. స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ ఆఫీసులు ఆదివారం తెరచుకోవు. కొన్ని ప్రైవేట్ కంపెనీల్లో శని, ఆది వారం కూడా సెలవు ఉంటుంది. మొత్తంగా అందరూ సెలవుని ఎంజాయ్ చేస్తూ.. రిలాక్స్ అవుతారు. మనుషులు సరే.. మరి పశువులు సంగతేంటి? ఆవు, గేదె, ఎద్దు వంటి జంతువులు.. మనకు పనిలో ఎంతగానో సహాయపడతాయి. మనకోసం పాలు ఇస్తాయి. పొలాలను దున్నుతాయి. మరి వాటికీ ఆదివారం సెలవు ఉండాలి కదా. జార్ఖండ్లోని లతేహర్ గ్రామంలో.. జంతువులకు ఆదివారం సెలవు ఇచ్చే సంప్రదాయం అనాదిగా ఉంది. ఆ రోజున ప్రజలు వాటి జోలికి వెళ్లరు. వాటికి ఏ పనీ చెప్పరు. రోజంతా విశ్రాంతి ఇచ్చేస్తారు. ఈ సంప్రదాయం ప్రారంభం కావడం వెనక ఓ విషాద కథ ఉంది. వందేళ్ల కిందట పొలంలో పనిచేస్తూ ఓ ఆవు చనిపోయింది. ఆ ఆవు అంటే.. ఊరిలో అందరికీ ఎంతో ఇష్టం. ఎవర్నీ ఏమీ అనేది కాదు. అది చనిపోవడంతో అంతా బాధపడ్డారు. అలా ఆదివారం జంతువులకు సెలవు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం లతేహార్ గ్రామానికి దగ్గర్లోనే ఉన్న హర్ఖా, ముంగర్, లాల్గాడి, పక్ర్ గ్రామాలలో కూడా ఇదే విధంగా చేస్తున్నారు. ఇపుడిపుడే ఈ సంప్రదాయం జార్ఖండ్ లోని ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తుంది.