బీజేపీ-టీడీపీ, జనసేన పార్టీల పొత్తు ఖరారైంది. ఈ మేరకు చంద్రబాబు, పవన్ ..బీజేపీ అగ్రనేత అమిత్ షా, అధ్యక్షుడు నడ్డా , ఆర్ఎస్ఎస్ కీలక నేతలతో ఢిల్లీలో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. దీంతో ఎన్డీయేలో తెలుగు దేశం, జనసేన చేరిక ఖరారైంది. పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించాల్సిన స్థానాల పై ఢిల్లీలో సుదీర్ఘ చర్చలు జరిగాయి. గంటన్నర పాటు ఈ భేటీ జరిగింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం… తమకు వీలైనన్ని ఎక్కువ లోక్సభ స్థానాలు కేటాయించాలని షా, నడ్డా చెప్పారు. 10 నుంచి 12 లోక్సభ స్థానాలు తమకు కేటాయించాలని చంద్రబాబు-పవన్ వద్ద ప్రస్తావించారు. . ‘‘అసెంబ్లీలో మీరు సాధ్యమైనన్ని సీట్లు గెలిచి అధికారంలోకి రావాలని మాకు తెలుసు. లోక్సభలో కనీసం 400 స్థానాలు మా లక్ష్యం.. అని అమిత్ షా ..చంద్రబాబుతో అన్నట్లు సమాచారం.
బీజేపీ అడుగుతున్నన్ని సీట్లు కాకుండా 4 లోక్సభ, 8 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చంద్రబాబు, పవన్ పేర్కొన్నట్లు సమాచారం.
బీజేపీ పార్లమెంట్ స్థానాలు: ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ … రాజంపేట, హిందూపురం, తిరుపతి, ఏలూరు, విశాఖపట్నం ఎంపీ సీట్లను కేటాయించాలని సూచించినట్లు తెలిసింది. అలాగే అసెంబ్లీ సీట్ల విషయంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలో ఒక్కో సీటు, రాయలసీమలో నాలుగు, ఉత్తరాంధ్రలో రెండు స్థానాలు కావాలని బీజేపీ నేతలు చెప్పినట్లు తెలుస్తోంది.